ప్రియాంకగాంధీ భర్తకు ఈడీ షాక్.. నోటీసులు: లండన్ వెళ్లాలని కోర్టులో పిటిషన్
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రాబర్ట్ వాద్రాకు నోటీసులు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతనిని ఈ గురువారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. రాబర్ట్ వాద్రా.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ బావ. గురువారం ఉదయం పదిన్నర గంటలకు ఈడీ ఆఫీస్లో విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది.
లండన్లో 1.9 మిలియన పౌండ్ల విలువైన ఆస్తుల కొనుగోలు వ్యవహారంలో మనీ లాండరింగ్ ఆరోపణలతో పాటు ఢిల్లీ, రాజస్థాన్ బికానేర్లోని ఆస్తుల విషయంలో అవకతవకలు జరిగాయని రాబర్ట్ వాద్రాపై ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపై ఆయన ఇప్పటికే పలుమార్లు ఈడీ ఎదుట హాజరయ్యారు. ఆయన ముందస్తు బెయిల్ తీసుకున్నారు.
మా కృషిని గుర్తించి రేటింగ్ పెంచండి: అనిల్ అంబానీ
ఈ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని గత వారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. విచారణకు రాబర్ట్ వాద్రా సహకరించడం లేదని, ఆయనను కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరముందని పేర్కొంది. కానీ ముందస్తు బెయిల్ ఆటంకమని పేర్కొంది. ఈడీ వ్యాజ్యంపై తన స్పందనను తెలియజేయాలని రాబర్ట్ వాద్రాను సోమవారం కోర్టు ఆదేశించింది.
ఇదిలా ఉండగా, తనకు పేగులో కణతి ఉందని, ఇందుకోసం తాను లండన్ వెళ్లవలసి ఉందని రాబర్ట్ వాద్రా కోర్టుకు వెల్లడించారు. ఈ మేరకు వాద్రా లాయర్ బుధవారం కోర్టుకు వెల్లడించారు. న్యాయస్థానంలో మెడికల్ సర్టిఫికేట్స్ ఇచ్చారు. తాను లండన్ వెళ్లవలసి ఉన్నందున తన పాస్పోర్టును అప్పగించాలని కోరారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్ పైన విచారణనను జూన్ 3వ తేదీకి వాయిదా వేసింది.