ఎయిర్టెల్ మెగా ఐపీవో: రూ.7వేల కోట్ల సేకరణ! లండన్ ఎక్స్చేంజ్లో నమోదుకు ప్లాన్
భారతీ ఎయిర్టెల్ ఆఫ్రికా విభాగం భారీ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో)కు రానుంది. ఆఫ్రికన్ యూనిట్ స్టేక్స్ విక్రయించడం ద్వారా 1 బిలియన్ డాలర్లు సేకరించాలని నిర్ణయించింది. తద్వారా రుణాలు తగ్గించుకోవాలని భావిస్తోంది. 1 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.7వేల కోట్ల ఐపీవోకు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నిధుల సమీకరణ తమ కంపెనీ రుణ భారాన్ని తగ్గిస్తుందని ఎయిర్టెల్ ఆఫ్రికా భావిస్తోంది. ప్రతిపాదిత ఐపీవోలో ఎయిర్టెల్ ఆఫ్రికాలోను 25 శాతం కొత్త షేర్లను విక్రయించాలని చూస్తోంది.
ఇద విషయాన్ని భారతీ ఎయిర్టెల్ మంగళవారం దేశీయ స్టాక్ ఎక్సేంజ్లకు తెలియజేసింది. నైజీరియాలో కూడా లిస్టింగ్కు ప్లాన్ చేస్తున్నట్లు ఎయిర్టెల్ తెలిపింది. టెమసెక్ హోల్డింగ్స్, సాఫ్ట్బ్యాంక్ గ్రూప్ కార్ప్ వంటి ఆరు సంస్థల నుంచి గత ఏడాది ఎయిర్టెల్ ఆఫ్రికా 1.25 బిలియన్ డాలర్లను సమీకరించింది. సంస్థలో ఈ మొత్తం ఈక్విటీ విలువ దాదాపు 4.4 బిలియన్ డాలర్లుగా ఉంది. 14 ఆఫ్రికా దేశాల్లో ఎయిర్టెల్ ఆఫ్రికా సేవలు అందిస్తోంది. ఈ సంస్థకు దాదాపు 98.9 మిలియన్ల వినియోగదారులున్నారు. ఆఫ్రికాలో రెండో అతిపెద్ద కంపెనీ ఎయిర్టెల్. కంపెనీ మొబైల్ మనీసేవలను 1.42 కోట్ల మంది వినియోగిస్తున్నారు. అత్యధిక కస్టమర్లు నైజీరీయాలో ఉన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఎయిర్టెల్ ఆప్రికా 307 కోట్ల డాలర్ల ఆదాయంపై 41.2 కోట్ల డాలర్ల లాభాన్ని ఆర్జించింది.
పై కంపెనీల నుంచి పెట్టుబడులు సేకరించడం ద్వారా కంపెనీ ఈక్విటీ విలువను 440 కోట్ల డాలర్లకు చేర్చుకుంది. పబ్లిక్ ఇష్యూలో కొత్తగా షేర్ల జారీ ద్వారా సేకరించే నిధులతో రుణభారం తగ్గించుకోవాలని భావిస్తోంది. తొలి ఐపీఓ సంబంధించి అవసరమైన డాక్యుమెంట్స్ను యూకే ఫైనాన్షియల్ కండక్ట్ అథారిటీకి సమర్పించామని భారతీ ఎయిర్టెల్ తెలిపింది. అలాగే నైజీరియాలో కూడా షేర్ల నమోదు చేసే ప్రతిపాదనను కూడా ఎయిర్టెల్ ఆఫ్రికా పరిశీలిస్తోందని తెలిపింది.
ప్రతిపాదిత ఇష్యూలో భాగంగా ఎయిర్టెల్ ఆఫ్రికాకు చెందిన 25 శాతం షేర్లను జారీ చేయనుంది. ఎంత మేర నిధులు సమీకరించనుందో వెల్లడించనప్పటికీ దాదాపు 7వేల కోట్లు అని తెలుస్తోంది.భారతీ ఎయిర్టెల్.. సునీల్ మిట్టల్ సారథ్యంలోని కంపెనీ. ఇండియాలో ఇది రిలయన్స్ జియోతో గట్టి పోటీ ఎదుర్కొంటోంది. 2016లో జియో లాంచ్ అనంతరం దానికి కస్టమర్లు పెరుగుతున్నారు.