ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి తెలుసా?: త్వరలో ప్రజల ముందుకు జగన్, ఏం కోరుకుంటున్నారు
ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. 2014లో అనుభవం ఉన్న చంద్రబాబును గెలిపించుకున్న నవ్యాంధ్ర ప్రజలు.. ఈసారి యువకుడైన వైయస్ జగన్మోహన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించారు. 175 స్థానాలకు గాను వైసీపీ 151 చోట్ల గెలవగా, టీడీపీ కేవలం 23 స్థానాల్లో గెలిచింది. పథకాలు, పాలన వంటి రాజకీయ అంశాలు పక్కన పెడితే, ప్రస్తుతం ఏపీ ఆర్థిక పరిస్థితి ఏమిటనేది అందరి మెదళ్లు తొలుస్తున్న ప్రశ్న.
475 మంది ఎంపీలు కోటీశ్వరులే: సరాసరిలో జగన్ పార్టీ టాప్
పాలనా అనుభవం లేని జగన్ ఎలా ముందుకు సాగుతారు
విభజన అనంతరం ముఖ్యమైన ఆదాయవనరు హైదరాబాద్ తెలంగాణకు వెళ్లింది. దీనికి తోడు రాజధాని, సచివాలయం, శాసన సభ వంటి భవనాలు లేకపోవడం గమనార్హం. దీంతో విభజన సమయంలోనే లోటు బడ్జెట్లో ఉన్న నవ్యాంధ్ర అప్పుల కుప్పలా మారింది. పెద్ద ఎత్తున అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ను పాలనా అనుభవం లేని వైసీపీ అధినేత ఎలా ముందుకు తీసుకు వెళ్తారనేది ఇప్పుడు ప్రశ్న. ఏపీ ముందుకు సాగాలంటే కేంద్రం సహకారం కూడా అవసరం. అలాగే, నిన్నటి దాకా కలిసి ఉన్న తెలంగాణతో పరస్పర సహకారంతో ముందుకు సాగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జగన్ హైదరాబాదులో కేసీఆర్తో, ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీ సహా పలువురిని కలిసి కలిశారు. అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని చెప్పారు.
అయిదేళ్లలో రూ.2 లక్షల 57వేల కోట్లకు పెరిగిన అప్పులు
ఆదివారం (మే 26) ప్రధాని మోడీ సహా పలువురు నేతలను కలిసిన అనంతరం జగన్ విలేకరులతో మాట్లాడారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఆర్థిక సాయం అవసరమని ప్రధాని మోడీని అభ్యర్థించానని, ప్రత్యేక హోదా ఆవశ్యకతను తెలియజేశానని చెప్పారు. ఏపీ సమస్యలపై ప్రధాని సానుకూలంగానే ఉన్నారన్నారు. రాష్ట్రం ఇప్పుడు ఓవర్ డ్రాఫ్టుపై బతకాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన నాటికి 97వేల కోట్ల అప్పులు ఉంటే చంద్రబాబు అయిదేళ్ల పాలనలో అది రూ.2 లక్షల 57 వేల కోట్లకు చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుల్లో ఉన్న ఏపీని కేంద్రం సహకారంతో ముందుకు తీసుకు వెళ్తారని వైసీపీ భావిస్తోంది.
ఓవర్ డ్రాఫ్టుతో అప్పుల ఊబిలోకి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014 నుంచి పలుమార్లు ఓవర్ డ్రాఫ్టుకు వెళ్లింది. గత ఏడాది (2018) నాటికి 1,768 కోట్ల ఓవర్ డ్రాఫ్టులో ఉంది. అయిదేళ్లలో దాదాపు 20సార్ల వరకు ఓవర్ డ్రాఫ్టుకు వెళ్లింది. ఆదాయం కంటే ఖర్చులో అధికంగా ఉన్నాయి. ఓ రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో ఓవర్ డ్రాఫ్టుకు వెళ్లేముందు, దానికి వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ రూపంలో ఆర్బీఐ నుంచి తాత్కాలిక రుణం పొందే అవకాశం ఉంటుంది. ఈ వేస్ అండ్ మీన్స్ పరిమితిని 100 శాతం దాటాకే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్టుకు వెళ్లే పరిస్థితి వస్తుంది. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సుపై వడ్డీ రేటు ఆర్బీఐ రెపో రేటు స్థాయిలో ఉంటుంది. ఓవర్ డ్రాఫ్టుపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రెపో రేటు కంటే రెండు శాతం అధికం. ఓవర్ డ్రాఫ్టుకు వెళ్లిన ప్రభుత్వాల ఖజానాపై వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సుకు వెళ్లిన దానికంటే అదనంగా వడ్డీ భారం పడుతుంది. ఇలాంటి నిధుల సేకరణ రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెడుతుంది. ఉమ్మడి పాలన కాలపు రుణభారంపై (రూ.23వేల కోట్లకు పైగా) వడ్డీ, ఉమ్మడి రుణం తాలూకు 58 శాతం వాటాపై వడ్డీని ఏపీ చెల్లిస్తోంది.
అమరావతి వైపు చూపులు
ఏపీకి పరిశ్రమలు వెల్లువెత్తితే, అభివృద్ధి జరిగితే ఖజానాలోకి మరింత రాబడి వస్తుంది. అందుకే చంద్రబాబు ప్రభుత్వం కూడా పరిశ్రమలకు రాయితీలు ఇచ్చాయి. దీనిని జగన్ కూడా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. పారిశ్రామిక, సేవా రంగాలు అమరావతి వైపు మరింతగా చూసేందుకు కొంత సమయం పడుతుంది. సేవా రంగాల్లో దక్షిణాదిన బెంగళూరు, హైదరాబాద్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అమరావతి కూడా అందుకు ధీటుగా ఎదగాల్సి ఉంది. ఏపీలో తలసరి ఆదాయం పెరిగినప్పటికీ అది కిందిస్థాయి వర్గాలకు తగిన మేర అందలేదని చెబుతున్నారు.
ఏపీ అభివృద్ధి కోసం జగన్ ఏం కోరుకుంటున్నారు
రాజధాని (హైదరాబాద్) ఉన్న ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడటం తెలంగాణలోనే మొదటిసారి అని, నవ్యాంధ్ర ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే చెందాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాలని జగన్ అభిప్రాయపడ్డారు. ఏపీలో ఉన్నత చదువులు చదివిన వారికి ఉద్యోగాలు లేవని, ప్రత్యేకంగా ఏమైనా జరిగితేనే ఉద్యోగాలు వస్తాయని, వందశాతం ఐటీ, జీఎస్టీ మినహాయింపులు వస్తే తప్ప ఇక్కడ పరిశ్రమలు, హోటళ్లు, ఆసుపత్రులు వచ్చే పరిస్థితి లేదని జగన్ చెబుతున్నారు. హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పలేదని, ఇది ఎగ్జిక్యూటివ్ డిసిషన్ అని, ప్రధాని నిర్ణయం తీసుకొని, హోదా ఇవ్వవచ్చని చెప్పారు.
ఏపీ ఆర్థిక పరిస్థితి ఇదీ.. త్వరలో ప్రజలకు జగన్
ఏపీ ఆర్థిక పరిస్థితి బాగాలేదనే తాను డిల్లీకి వచ్చానని, ప్రజలకు మాట ఇచ్చామని, వాటిని నెరవేర్చాల్సి ఉందని జగన్ చెప్పారు. తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం విభాగాలవారీగా సమీక్షించి ఏపీ పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేస్తానని చెప్పారు. ఏపీ ఆర్థిక పరిస్థితి ప్రజలకు తెలియాలన్నారు. రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు.