లిక్కర్ స్టాక్స్కు వైఎస్ జగన్ దెబ్బ!
మద్యం స్టాక్స్ ఈ రోజు స్టాక్ మార్కెట్లో నష్టాల బాట పట్టాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో దశలవారీగా మద్యపాన నిషేధాన్ని చేపడ్తానంటూ వైఎస్ జగన్ ప్రకటించారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన విలేఖరుల సమావేశంలో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే తక్షణం మద్యాన్ని నిషేధిస్తే ఆర్థిక అనిశ్చితి వస్తుందని, ఇతర ఆదాయ మార్గాలను చూసుకుని తప్పకుండా తాను మద్యాన్ని ఏపీలో నిషేధిస్తానని ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి.
ఆల్కహాల్ను పూర్తిస్థాయిలో విలాస వస్తువుగా మార్చి కేవలం ఫైవ్ స్టార్స్ హోటల్స్లోనే దొరికేలా చేస్తానని తేల్చిచెప్పారు. ఈ లెక్కన మద్యంపై అధిక పన్నులు విధించడం, పర్మిట్లపై ఆంక్షలు వంటి అనేక కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏపీ పెద్ద మార్కెట్
ఏపీ సీఎం డిసిగ్నేట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన నేపధ్యంలో ప్రముఖ లిక్కర్ కంపెనీల స్టాక్స్ ఈ రోజు నష్టాల్లో ముగిశాయి. యునైటైడ్ స్పిరిట్స్, యునైటెడ్ బెవరేజ్ వంటి ప్రధాన కంపెనీల స్టాక్స్ రెండు నుంచి మూడు శాతం వరకూ కోల్పోయాయి. మార్కెట్ లాభాల్లో ఉన్నా ఈ స్టాక్స్ మాత్రం నిరుత్సాహపడ్డాయి. వీటితో పాటు రాడికో, పయనీర్ డిస్టిలరీస్ వంటివి కూడా నీరసించాయి. ఎందుకంటే లిక్కర్ కంపెనీలకు దిక్షణాదిలోని అతిపెద్ద మార్కెట్లలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. ఇప్పటికే బీహార్, గుజరాత్ రాష్ట్రాల్లో సంపూర్ణ మద్యనిషేధం అమల్లో ఉంది. గతంలో పశ్చిమ బెంగాల్ కూడా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్టు వెల్లడించింది. గతంలో కేరళ కూడా మద్యపానాన్ని నిషేధించినా.. తర్వాత దాన్ని సడలించింది. ఇలా వివిధ రాష్ట్రాలు ఈ తరహా ఆంక్షల నేపధ్యంలో లిక్కర్ స్టాక్స్ నష్టాల్లోకి జారుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications