ట్రంప్ దెబ్బకు దెబ్బ: అమెరికా కంపెనీలపై చర్యలకు చైనా రెడీ
అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం ముదురుతోంది. చైనా ఉత్పత్తులపై అగ్రరాజ్యం టారిఫ్ విధించడం, ప్రతిగా డ్రాగన్ కంట్రీ... అమెరికా అత్పత్తులపై టారిఫ్ విధించడం తెలిసిందే. ఆ తర్వాత చైనా దిగ్గజ మొబైల్ కంపెనీ హువావేపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ట్రంప్ నిర్ణయం నేపథ్యంలో గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి పలు కంపెనీలు హువావేకు షాకిచ్చాయి. తాము హువావేకు సేవలు నిలిపివేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఆ తర్వాత శుక్రవారం రోజు మైక్రోసాఫ్ట్ తమ ఆన్లైన్ స్టోర్ నుంచి హువావే ల్యాప్టాప్స్ తొలగించింది. ఇంటెల్, క్వాల్కామ్, జిలింక్స్, బ్రాడ్కామ్లు కూడా అదే దారిలో నడిచాయి. దీంతో హువావే కంపెనీతో పాటు చైనా అగ్రరాజ్యంపై ఆగ్రహంతో ఉంది.
అమెరికా కంపెనీలపై ప్రతీకారం తీర్చుకొనేందుకు చైనా కూడా తన చట్టాలకు పదును పెడుతోంది. చైనాకు చెందిన సైబర్ స్పేస్ అడ్మిన్స్ట్రేషన్ కొన్ని నిబంధనలను సిద్ధం చేసిందట. వీటిని అమలు చేస్తే చైనాలో కీలకమైన విదేశీ పరికరాలు, సేవలను పొందితే వచ్చే ముప్పును పరిశీలిస్తోందట. ఈ విషయాన్ని ఓ చైనా పత్రిక వెల్లడించింది.
Huawei పై ట్రంప్ ఆగ్రహం వెనుక..: సీఈవో కూతురు అరెస్ట్ నుంచి.. ఏం జరిగిందంటే?
ప్రజాభిప్రాయం కోసం జూన్ 24లోపు ఈ ప్రతిపాదనలను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. లీకింగ్, పోగొట్టుకోవడం, కీలక సమాచారం సరిహద్దులు దాటడం వంటి ముప్పులకు సంబంధించి ఇది ఉండవచ్చునని తెలుస్తోంది. చైనా మార్కెట్లో ఉన్న అమెరికా టెక్నాలజీని అడ్డుకొనేందుకు ఈ నిబంధనలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు.
కాగా, హువావేపై ట్రంప్ చర్యల కారణంగా ఈ ఫోన్ల అమ్మకాలు పడిపోతాయని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీనిపై హువావే స్పందించింది. తమ స్మార్ట్ఫోన్లను నిరభ్యతరంగా వినియోగించవచ్చని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్లకు ఉపయోగపడేలా అభివృద్ధి చేసిన ఆండ్రాయిడ్ సిస్టమ్తో ఎంతో కాలం నుంచి పని చేస్తున్నామని, అది అలా కొనసాగుతుందని పేర్కొంది.
హువావే, హానర్ స్మార్ట్ఫోన్లకు, ట్యాబ్లకు ఎప్పటికప్పుడు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని తెలిపింది. ఇప్పటికే యూజర్ల చేతుల్లో ఉన్న ఫోన్లకు, కొత్త ఫోన్లకు సేవలు యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది. వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. అలాగే యూజర్ల అభిరుచికి తగినట్లు ఓ సరికొత్త సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసేందుకు సంస్థ నిరంతరం కృషి చేస్తోందని పేర్కొంది.