బంగారం దారెటు? ధరలు పెరుగుతాయా?
హైదరాబాద్: భారత మహిళలు-బంగారం.. విడదీయలేని సంబంధం. తరాలుగా మనవారు బంగారాన్ని ఆభరణాలుగా ధరిస్తూనే ఆస్తిగా కూడబెట్టుకోవడం ఆచారంగా వస్తోంది. అయితే కొంతకాలంగా బంగారం కొనుగోళ్లు, బంగారంపై పెట్టుబడులు కొత్త రూపం సంతరించుకుంటున్నాయి.
అమెరికా - చైనా వాణిజ్య యుద్ధంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు నెమ్మదిస్తున్నాయి. గ్లోబల్ స్టాక్ మార్కెట్లు స్తబ్దుగా ఉన్నాయి. చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరలు పెరుగుతాయా, తగ్గుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది.
అధిక ధరల కారణంగా 2018లో భారత్లో బంగారం కొనుగోళ్లు నెమ్మదించాయి. తద్వారా బంగారం దిగుమతి 760 టన్నులకు పరిమితమైంది. 2017తో పోల్చితే ఇందులో 20 శాతం తరుగుదల నమోదయింది. ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధరలు రూ.31,400 (పది గ్రాములకు) పలుకుతుండగా, ఈ ఏడాది చివరి వాటికి రూ.33,000 మార్కు దాటవచ్చునని అంచనా వేస్తున్నారు.
సాధారణంగా ఆర్థిక మందగమనం వంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు జనాలు బంగారంపై పెట్టుబడులు పెట్టడం సహజ ఆర్థిక సూత్రం. కానీ భారత్ పరిస్థితులు కాస్త భిన్నంగా ఉండేలా ఉన్నట్లు ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. రెండోసారి బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టడం ఖాయమంటున్నారు.ఇందుకు నిదర్శనమే మొన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాగానే ఏకంగా సెన్సెక్స్ 1422 పాయింట్లు ఎగబాకింది. పదేళ్లలో ఇదే అతిపెద్ద ఆర్థిక రికార్డ్. ఒకవేళ నిజంగానే ఎన్డీయే ప్రభుత్వమే వస్తే మార్కెట్లకు పట్టపగ్గాలు ఉండవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదే జరిగితే పెట్టుబడులు బంగారం నుంచి స్టాక్ మార్కెట్లోకి మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ధరలు పెరగకపోవచ్చు. అయితే బంగారం ధరల పెరుగుదల లేదా తరుగుదల కేవలం భారత్లో దాని వినియోగంపై ఆదారపడి ఉండదు. ప్రపంచ పరిణామాలే బంగారం ధరలను నిర్దేశిస్తాయి. డాలర్ హెచ్చతగ్గులు కూడా ధరలను ప్రభావితం చేస్తాయి.
ప్రపంచంలోనే ఆర్థికంగా బంగారం వినియోగించే దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. అయితే ఇక్కడ విక్రయించే బంగారంలో సింహభాగం దిగుమతి చేసుకున్నదేనని గుర్తించాలి. అందులో ప్రపంచ పరిణామాలను దృష్టిలో ఉంచుకుంటే బంగారం ధరలు రూ.32,000 నుంచి 35,000 మధ్య ఉండే అవకాశముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కేవలం ధరలు మాత్రమే బంగారం వినియోగాన్ని భారీగా తగ్గించడమో పెరగడమో చేయలేదని, ఆర్థిక అంశాలే వినియోగాన్ని ఖరారు చేస్తుందన్నది ఆర్థికవేత్తల మాట.