హువావే దెబ్బ: మా ఉత్పత్తులే ఆపేస్తారా.. 'ఆపిల్'పై చైనా యువత ఆగ్రహం
అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం ప్రభావం చైనీస్ దిగ్గజ సంస్థ హువావేపై పడుతోంది. దీంతో చైనాలో సరికొత్త ఉద్యమం ఊపందుకుంది. ఆపిల్కు వ్యతిరేకంగా, హువావేకు మద్దతుగా చైనా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభమైంది. ఆపిల్ ఉత్పత్తులను నిషేధించాలని సోషల్ మీడియా ద్వారా పిలుపునిస్తున్నారు. హవావేను బ్లాక్ లిస్ట్లో చేర్చిన అమెరికా, 90 రోజుల వెసులుబాటు మాత్రమే కల్పించింది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో గూగుల్ కూడా హువావేకు సేవలు నిలిపేస్తామని తెలిపింది. దీంతో చైనా వెలుపల (చైనా కాకుండా ఇతర దేశాల్లో) హువావే ఫోన్ల విక్రయంపై ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో చైనా యువత హువావేకు మద్దతుగా నిలబడ్డారు.
ఆపిల్ ఉత్పత్తులు బ్యాన్ చేయాలని పిలుపు
చైనాకు చెందిన యువత, వినియోగదారులు.. ఆపిల్ ఉత్పత్తులు బ్యాన్ చేయాలని పిలుపునిస్తున్నారు. చైనా యువత ఇలా నిరసన కారణంగా డ్రాగన్ దేశంలో ఆపిల్ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఫోన్ తయారీ సంస్థ హువావే ఉత్పత్తులు, టెక్నాలజీపై ఆంక్షలు విధించిన ట్రంప్ ప్రభుత్వంపై చైనా యువత మండిపడుతోంది.
ఆపిల్ వ్యతిరేక ఉద్యమం
ట్విట్టర్, వైబోలాంటి సోషల్ మీడియా వేదికల్లో ఆపిల్ ఉత్పత్తులను బ్యాన్ చేయాలని పిలుపునిస్తున్నారు. ఈ పోస్టులకు మిలియన్ల కొద్ది లైకులు వస్తున్నాయి. పెద్ద ఎత్తున షేర్లు చేస్తున్నారు. చైనా దేశమంతా యాపిల్ వ్యతిరేక ఉద్యమం ఊపందుకుంది. హువావేపై ట్రంప్ సర్కార్ వేధింపులకు పాల్పడుతోందని మండిపడుతున్నారు.
ఇది నెటిజన్ల మాట
తాము ఆపిల్ ఐఫోన్ కొనడం మానేసి, హువావే ఫోన్ కొనుగోలు చేస్తామని పలువురు యూజర్లు చెబుతున్నారు. 'నేను హువావే ఫోన్ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాను. ఆపిల్ ఫోన్ కొనుగోలు చేయాలనే నిర్ణయాన్ని మార్చుకున్నాను. హువావేకు మద్దతుగా తాను అదే ఫోన్ కొనుగోలు చేస్తాను' అని ఓ యువకుడు పేర్కొన్నాడు. నేను ఇతర ఫోన్ వాడకాన్ని పక్కన పెట్టి హువావేను కొనుగోలు చేస్తానని మరో వ్యక్తి చెప్పాడు. హువావేను అమెరికా అడ్డుకుంటే, తాము ఆపిల్ కొనుగోలు ఆపేస్తామని ఇంకో నెటిజన్ చెప్పాడు. పరిస్థితి ఇలాగే ఉంటే ఆపిల్ అమ్మకాలను బాగా దెబ్బతీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తాజా పరిణామాలపై మాట్లాడేందుకు ఆపిల్ తిరస్కరించింది.