స్వల్పంగా తగ్గిన బంగారం ధర, డాలర్తో రూపాయి మారకం 69.72
న్యూఢిల్లీ: మంగళవారం నాడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. రెండు రోజుల క్రితం వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం విజయం సాధిస్తుందని వెల్లడైంది. దీంతో మార్కెట్లు దూకుడు మీద ఉన్నాయి. ఈ ప్రభావం కూడా బంగారంపై పడిందని అంటున్నారు. బలహీనమైన గ్లోబల్ సెంటిమెంట్, డాలర్ బలపడటంతో అంతర్జాతీయంగా బంగారం షైన్ అయింది.
మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అహ్మదాబాద్లో 995 ప్యూరిటీ పది గ్రాముల బంగారం ధర 31,550గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర రూ.50 తగ్గి, 10 గ్రాముల బంగారం ధర రూ.32,670గా ఉంది. స్థానిక బంగారం వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గింది. వెండి ధర సోమవారం లాగే స్థిరంగా ఉంది. కేజీ వెండి రూ.37,350 గా ఉంది.
మోడీ 5 ఏళ్ల పాలనలో..: రూ.లక్ష పెట్టుబడితో రూ.56 లక్షలు
అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ఔన్సుకు 1,276 డాలర్లు, వెండి ఔన్సుకు 14.49 డాలర్లుగా ఉంది. ఢిల్లీలో 99.9శాతం ప్యూర్ గోల్డ్ 32,670గా, 99.5 శాతం ప్యూర్ గోల్డ్ రూ.32,500 గా ఉంది. సావరిన్ గోల్డ్ 8 గ్రాములకు స్థిరంగా రూ.26,500 వద్ద ఉంది. వెండి కిలో ధర రూ.37,350గా ఉంది.
ఇదిలా ఉండగా, భారత్ బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. ఏప్రిల్లో ఈ దిగుమతులు 54 శాతం పెరిగి 397 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. అంతకు ముందు ఏడాది ఇదే నెలలో బంగారం దిగుమతులు 258 కోట్ల డాలర్లుగా ఉంది. దిగుమతుల పెరుగుదలతో వాణిజ్య లోటు మరింతగా పెరిగింది. కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) పైనా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
డాలర్తో రూపాయి మారకం విలువ 69.72 పైసల వద్ద ముగిసింది. అంతకుముందు రోజు (సోమవారం) 69.74 పైసల వద్ద క్లోజ్ అయింది. మే 20వ తేదీన రూపాయి 49 పైసలు బలపడింది.