పదేళ్ల తర్వాత పట్టపగ్గాల్లేని పరుగు ! సెన్సెక్స్ 1400 పాయింట్స్ జంప్
స్టాక్ మార్కెట్లో ఇలాంటి రోజులు చాలా అరుదు. పదేళ్ల తర్వాత మళ్లీ ఈ రోజే సూచీలు శివాలెత్తినట్టు పరుగులెత్తాయి. సెన్సెక్స్ ఏకంగా 1400, నిఫ్టీ 400, బ్యాంక్ నిఫ్టీ 1300 పాయింట్లు పెరిగాయి. మార్కెట్స్ పెరుగుతాయని ఎనలిస్టులు ఊహించినప్పటికీ.. ఈ స్థాయిలో జోష్ ఉంటుందనే సంగతిని ఎవరూ పసిగట్టలేకపోయారు. గత రెండు సెషన్లలోనే 300 పాయింట్ల వరకూ పెరిగిన నిఫ్టీ ఈ రోజు ఏకంగా 430 పాయింట్ల వరకూ పెరిగింది. అన్ని రంగాల షేర్లూ లాభాలను పంచాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు రెండూ ఇరగదీశాయి. మొత్తానికి పదేళ్ల తర్వాత దస్ సాల్ కా దమ్ ఈ రోజే మార్కెట్లో స్పష్టంగా కనిపించింది. మళ్లీ మోడీ అధికారంలోకి వస్తున్నారని ఎగ్జిట్ పోల్స్ అన్నీ అంచనా వేసిన నేపధ్యంలో మార్కెట్ సూచీలు సోమవారం రోజున ఇన్వెస్టర్లకు స్వీట్ న్యూస్ చెప్పాయి. చివరకు రికార్డ్ క్లోజింగ్ను నమోదు చేశాయి.
ఉదయం స్థిరంగా ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీలు మొదటి రెండు గంటల పాటు ఒడిదుడుకులకు లోనయ్యాయి. సెన్సెక్స్ మొదట 950 పాయింట్ల వరకూ పెరిగినప్పటికీ.. ఆ తర్వాత లాభాల స్వీకరణ నమోదైంది. అయితే మళ్లీ మిడ్ సెషన్ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో పెరిగిన మార్కెట్లు ఇక ఏ దశలోనూ వెనక్కి తగ్గిన దాఖలాలు లేవు. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల నుంచి వచ్చిన మద్దతుతో మరోసారి రికార్డులకు అతి చేరువలోకి వెళ్లాయి సూచీలు. చివరకు సెన్సెక్స్ 1422 పాయింట్ల లాభంతో 39, 353 దగ్గర క్లోజైంది. నిఫ్టీ 421 పాయింట్లు పెరిగి 11828 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఏకంగా 1310 పాయింట్లు పెరిగి 30760 దగ్గర స్థిరపడింది.
ఇక రంగాల వారీగా చూస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులు, రియాల్టీ, ఫైనాన్షియల్ సర్వీసులు, ఆటోమొబైల్, మెటల్ రంగ కౌంటర్లకు అనూహ్యమైన కొనుగోళ్ల మద్దతు లభించింది. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 4 శాతానికి పైగా పెరిగాయి. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, టాటా మోటార్స్ టాప్ 5 గెయినర్స్గా నిలిచాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, జీ ఎంటర్టైన్మెంట్, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ స్టాక్స్ లూజర్స్ జాబితాలో నిలిచాయి.
అదానీ, అనిల్ అంబానీ గ్రూప్ స్టాక్స్ ఎగెరెగిరి పడ్డాయ్
ఈ ర్యాలీలో ప్రధానంగా అదానీ గ్రూప్ స్టాక్స్ బాగా పెరిగాయి. ఎందుకంటే గుజరాతీ కంపెనీ అయిన అదానీ.. బిజెపికి, ప్రధానంగా నరేంద్ర మోడీకి కాస్త సన్నిహితంగా మెలుగుతూ ఉంటుంది. మళ్లీ మోడీ మానియా ఉన్న నేపధ్యంలో ఈ గ్రూప్ స్టాక్స్కు పూర్వవైభవం రాకపోదా అనే ఊహాగానాలతో అదానీ ఎంటర్ప్రైజెస్ 20 శాతానికి పైగా పెరిగింది. అదానీ పవర్, అదానీ గ్యాస్, అదానీ గ్రీన్ స్టాక్స్ 10 శాతానికి పైగా పెరిగాయి. అదానీ పోర్ట్స్ కూడా 5 శాతానికి పైగా పెరిగింది.
ఇండియాబుల్స్ గ్రూప్ స్టాక్స్ కూడా ఇదే స్థాయిలో పెరిగాయి. ఇండియాబుల్స్ హౌసింగ్ స్టాక్ ఏకంగా 13 శాతం పెరిగింది. ఐబివెంచర్స్ 17 శాతం, ఐబి రియల్ ఎస్టేట్ 15 శాతం పెరిగాయి. అనిల్ ధీరూభాయ్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ 18 శాతం, రిలయన్స్ ఇన్ఫ్రా 12.5 శాతం, రిలయన్స్ క్యాపిటల్ 8 శాతం పెరిగాయి.
ప్రభుత్వ బ్యాంక్ స్టాక్స్ పరుగో పరుగు
ప్రభుత్వ బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ ఈ రోజు జోరుమీదున్నాయి. మళ్లీ ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేస్తారనే అంచనాలతో ఈ స్టాక్స్ అన్నింటినీ దౌడు తీయించాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా 11 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 10 శాతం, సిండికెట్ బ్యాంక్ - అలహాబాద్ బ్యాంక్, ఎస్బీఐ, కెనెరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ స్టాక్స్ 8 శాతానికిపైగా లాభపడ్డాయి.
డాక్టర్ రెడ్డీస్.. డౌన్..
నిఫ్టీ 50 స్టాక్స్లో ఈ రోజు భారీగా పతనమైన కౌంటర్ ఏదైనా ఉందీ అందే అది డాక్టర్ రెడ్డీస్ మాత్రమే. అనూహ్యంగా ఈ స్టాక్ 6 శాతం పతనమైంది. చివరకు రూ.2544 దగ్గర క్లోజ్ అయింది.
మరో నిఫ్టీ స్టాక్ జీ ఎంటర్టైన్మెంట్ కూడా 2.5 శాతం వరకూ నష్టపోయింది.