గుడ్ న్యూస్: ఆ చట్టంతో రూ.2.8 లక్షల కోట్ల మొండి బకాయి వసూలు, క్యూలో మరో రూ.3 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియను, దాని ప్రభావాన్ని కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఘన విజయంగా అభివర్ణించింది. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (IBC) రాకతో బ్యాంకింగ్ రంగంలో పేరుకున్న మొండి బకాయిలు (NPA) రూ.2.8లక్షల కోట్లు వసూలు అయినట్లు సదరు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు వెల్లడిస్తున్నారు. బ్యాంకింగ్ రంగ మొండి బకాయిలు రూ.10 లక్షల కోట్లపైనే ఉన్నాయి.
SBI కస్టమర్ అలర్ట్: ఇవి తెలుసుకోండి
రూ.2.8 లక్షల కోట్లు వసూలు
రికార్డ్స్ ప్రకారమే ఇందులో ప్రభుత్వరంగ బ్యాంక్స్ వాటా రూ.8 లక్షల కోట్ల వరకు ఉంది. దివాలా చట్టం ద్వారా వంద కేసుల వరకు పరిష్కారమయ్యాయి. భూషణ్ స్టీల్ అండ్ పవర్, ఎస్సార్ స్టీల్ వంటి భారీ కార్పోరేట్ సంస్థల వాటానే రూ.1.8 లక్షల కోట్లు. మధ్య, చిన్న శ్రేణి సంస్థలకు చెందిన రూ.లక్ష కోట్లు వచ్చాయి. మొత్తంగా రూ.2.8 లక్షల కోట్లు వసూలైనట్లు తెలిపారు. IBC సత్ఫలితాలు ఇచ్చిందని చెబుతున్నారు.
రానున్న మరో రూ.3లక్షల కోట్లు
రూ.2.8 లక్షల కోట్ల మొండి బకాయిలు వసూలు అవగా, మరో రూ.3 లక్షల కోట్ల బకాయిలు రానున్నాయని కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఇప్పటికే వంద కేసులు పరిష్కారం కాగా, మరో 6,500 కేసులు పరిష్కారం కానున్నాయని వెల్లడించింది. కోర్టు వెలుపల జరిగే మరో వంద కేసులకు 90 శాతం రుణదాతల కమిటీ ఆమోదం లభించిందట. 500 కేసులు కోర్టుల్లో పరిష్కారమయ్యాయని తెలుస్తోంది. వివిధ కారణాల వల్ల కొన్ని పరిష్కార ప్రక్రియలకు బ్రేకులు పడ్డాయి.
రుణదాతలకు నష్టం జరుగుతోందా?
దివాలా పరిష్కార ప్రక్రియలో రుణదాతలకు నష్టం జరుగుతోందని, ఇచ్చిన రుణం విలువలో భారీగా కోతలు పడుతున్నాయనే విమర్శలు వచ్చాయి. దీనిని కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. రుణదాతలకు రిజల్యూషన్ ప్రక్రియలో 200 శాతం మార్కెట్ విలువ దక్కుతుందని తెలిపింది. ఇది దివాలా చట్టం వల్లేనని తెలిపింది. దివాలా చట్టం వల్ల బ్యాంకుల మొండి బకాయిల చిట్టా క్రమంగా తగ్గుతోంది. గతంలో నష్టాలను ప్రకటించిన బ్యాంకులు ఇప్పుడు లాభాలను ప్రకటిస్తున్నాయి.