ఎగ్జిట్ పోల్స్: మార్కెట్లో రికార్డులు సృష్టించిన అదానీ గ్రూప్
ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే వైపు మొగ్గు చూపాయి. బీజేపీకి ఒంటరిగా 260 సీట్ల నుంచి 300 పై చిలుకు సీట్లు వస్తాయని, ఎన్డీయేకు 300 నుంచి 370 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. ఎన్డీయే స్పష్టమైన మెజార్టీ గెలుస్తుందనే అంచనాల నేపథ్యంలో సోమవారం అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి.
అదానీ ఎంటర్ప్రైజెస్ మధ్యాహ్నం 29 శాతం వద్ద ట్రేడ్ అయింది. గత రెండేళ్లలో ఇదే అత్యధికం. అదానీ పవర్, అదానీ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వంటి కంపెనీలు మధ్యాహ్నం 15 శాతం వద్ద ట్రేడ్ అయ్యాయి. అదానీ ట్రాన్స్మిషన్స్, అదానీ పోర్ట్స్ షేర్లు కూడా భారీగా లాభపడ్డాయి.
అదానీ గ్రీన్ ఎనర్జీ ఇంట్రాడేలో 17 శాతం పెరిగి రూ.144.30ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. అదానీ ట్రాన్స్మిషన్స్: ఇంట్రాడేలో 10 శాతం పెరిగి రూ.226.50ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. అదానీ పవర్ ఇంట్రాడేలో 16శాతం పెరిగి రూ.47.25ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. అలాగే అదానీ గ్యాస్ 12 శాతం ఎగిసింది. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ సాయంత్రానికి 28.96 శాతం లాభాలతో 153.85 వద్ద ముగిసింది.