TV9 మాజీ సీఈవో రవిప్రకాశ్-శివాజీ మధ్య ఒప్పందం: ఈ-మెయిల్స్తో కీలక విషయాలు వెలుగులోకి
హైదరాబాద్: TV9 మాజీ సీఈవో రవిప్రకాశ్కు, సినీ నటుడు శివాజీకి మధ్య జరిగిన కొన్ని ఈ-మెయిల్ సంభాషణలపై సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి సారించారు. ఇందులో ఎన్నో కీలక విషయాలు వెలుగు చూశాయని తెలుస్తోంది. శివాజీ, రవిప్రకాశ్ మధ్య నకిలీ ఒప్పందం జరిగినట్లుగా గుర్తించారని తెలుస్తోంది. వారిద్దరి మధ్య నకిలీ ఒప్పందం షేర్ల కొనుగోలు అగ్రిమెంట్కు సంబంధించిన పూర్తిస్థాయి ఆధారాలు సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించారని తెలుస్తోంది.
TV9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఎక్కడున్నాడు?
ఈ ఏడాదిలో ఒప్పందం జరిగితే గత ఏడాది జరిగినట్లుగా సృష్టించారా?
ఇటీవల పోలీసులు జరిపిన సోదాల్లో రవిప్రకాశ్, శివాజీల మధ్య ఈ మెయిల్స్ సంభాషణలు, ఒప్పందాలకు సంబంధించిన పలు అంశాలు వెలుగు చూశాయి. ఈ ఏడాది ఏప్రిల్లో రవిప్రకాశ్కు, మరో ఐదుగురికి మధ్య ఈ మెయిల్ సంభాషణలు నడిచాయని గుర్తించారని తెలుస్తోంది. సంభాషణల అనంతరం మెయిల్స్ను రవిప్రకాశ్ బృందం తొలగించినట్లుగా కూడా పోలీసులు గుర్తించారని సమాచారం. సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో మెయిల్స్ను ఫోరెన్సిక్ నిపుణులు రిట్రీవ్ చేయగా, విజయవాడకు చెందిన లాయర్ ఫైనల్ డ్రాఫ్ట్ తయారు చేశారట. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఒప్పందం చేసి, గత ఏడాది ఫిబ్రవరిలో (2018) ఒప్పందం జరిగినట్లుగా రవిప్రకాశం బృందం డాక్యుమెంట్లు సృష్టించినట్లుగా పోలీసుల విచారణలో తేలిందని సమాచారం.
తెరపైకి శక్తి అనే పేరు
రవిప్రకాశ్, శివాజీ మధ్య కుదిరింది పాత ఒప్పందం కాదని, ఎన్సీఎల్టీలో కేసు వేయడం కోసమని, పాత తేదీతో నకిలీ షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు పోలీసులు కీలక ఆధారాలు సేకరించడంతో కొత్త మలుపు తిరిగింది. శక్తి అనే వ్యక్తి నుంచి డైరెక్టర్ ఎంకేవీఎన్ మూర్తి, రవిప్రకాశ్, రవిప్రకాశ్ సన్నిహితుడు హరి అనే వ్యక్తి, ఏబీసీఎల్ ఫైనాన్స్ అధికారిగా ఉన్న మూర్తి అనే మరో వ్యక్తికి మధ్య జరిగిన ఈ-మెయిల్ సంభాషణలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మెయిల్స్ డిలీట్ చేసినప్పటికీ టెక్నాలజీ సహకారంతో వీటిని వెలికితీశారు. రవిప్రకాశ్ నుంచి 40వేల షేర్లను కొనేందుకు శివాజీ ఫిబ్రవరి 20, 2018న ఒప్పందం కుదుర్చుకున్నట్లు సృష్టించిన డ్రాఫ్ట్ నిజానికి ఏప్రిల్ 13, 2019న తయారు చేసినట్లు గుర్తించారు. ఈ డ్రాఫ్ట్ ఆ రోజు సాయంత్రం ఫైనాన్స్ అధికారి మూర్తికి మెయిల్ చేసిన శక్తి అనే మరో వ్యక్తి మిగతా వారికి కూడా కాపీలు పంపించాడని తెలుస్తోంది. ఇటీవలే ఆ ఒప్పందం చేసుకున్నప్పటికీ, గతంలో చేసినట్లుగా చూపించారు. శివాజీ ఎన్సీఎల్టీలో దాఖలు చేసేందుకు అవసరమైన పిటిషన్ను విజయవాడకు చెందిన ఓ లాయర్ రూపొందించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ పిటిషన్ కాపీనీ, అందులోని మార్పులను ఈ మెయిల్లో ప్రస్తావించడమే కాకుండా, మార్పులతో విజయవాడ అడ్వోకేట్కు పంపించాల్సి ఉంటుందని రవిప్రకాశ్, ఆయన అనుచరులకు శక్తి మెయిల్ పంపినట్లుగా మెసేజ్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. వీటి ఆధారంగా పోలీసులు సెక్షన్ 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది. ఈ మెయిల్స్ ద్వారా తెరపైకి శక్తి అనే మరో పేరు వచ్చింది.
స్పందించని రవిప్రకాశ్, హైకోర్టు షాక్
TV9 వాటాల వివాదంలో చిక్కుకున్న రవిప్రకాశ్ సీసీఎస్ పోలీసుల నోటీసులకు స్పందించలేదు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదైన రెండు కేసుల దర్యాప్తులో భాగంగా పోలీసులు మూడు నోటీసులు జారీ చేశారు. రెండు దఫాలుగా 160 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. రవిప్రకాశ్ స్పందించకపోవడంతో 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. రవిప్రకాశ్ అందుబాటులో లేకపోవడంతో నోటీసును బంజారాహిల్స్లోని ఆయన ఇంటి తలుపులకు అంటించారు. బుధవారం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని పేర్కొన్నారు. ఈ నోటీసుకు కూడా స్పందించలేదు. ఆయన హాజరు కాకుంటే అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఇదే కేసులో రవిప్రకాశ్తో పాటు నటుడు శివాజీకి నోటీసులు ఇవ్వగా, వారు పది రోజుల సమయం కోరారు. వ్యక్తిగత కారణాలతో రవిప్రకాశ్, ఆరోగ్యం సరిగా లేదని శివాజీ పేర్కొన్నారు. మరోవైపు, సీఆర్పీసీ సెక్షన్ 154 కింద పోలీసులు కేసు నమోదు చేయడాన్ని రవిప్రకాశ్ హైకోర్టులో సవాల్ చేశాడు. దీనిని లంచ్ విరామ సమయంలో విచారణ చేపట్టాలని ఆయన తరఫు న్యాయవాది కోరాడు. అయితే సీఆర్పీసీ సెక్షన్ 154 రాజ్యాంగబద్దతను తేల్చడానికి అంత అవసరమేముందని, దీనిని జూన్లో చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది. ఇది రవిప్రకాశ్కు షాక్ అని చెప్పవచ్చు.
రవిప్రకాశ్, శివాజీలు ఏపీలో ఉన్నారా?
రవిప్రకాశ్ జాడ తెలియడం లేదు. దీంతో ఆయన ఎక్కడున్నారనే అంశంపై చర్చనీయాంశంగా మారింది. ఏపీ నేతలతో సంబంధాల నేపథ్యంలో అమరావతిలో ఆశ్రయం పొందుతున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయన గుర్తింపు కోసం ప్రత్యేక బృందాలు ఈ రోజు నుంచి (గురువారం) రంగంలోకి దిగుతున్నాయి. రవిప్రకాశ్, శివాజీలు ఏపీలోనే ఉన్నట్లుగా భావిస్తున్నారు.