విచారణపై సందిగ్ధత: TV9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఎక్కడున్నాడు?
TV9 మాజీ సీఈవో రవిప్రకాశ్ విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరవుతారా, హాజరైతే ఎప్పుడు అనే చర్చ కొనసాగుతోంది. ఆయనకు 160 సీఆర్పీసీ కింద వారం క్రితం పోలీసులు నోటీసులు జారీ చేశారు. దానికి ఆయన స్పందించలేదు. ఆ తర్వాత ఇటీవల 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు మళ్లీ జారీ చేశారు. దీనిపై కూడా ఎలాంటి పురోగతి లేదు. దీంతో సీసీఎస్ పోలీసుల ఎదుట ఆయన హాజరు విషయం చర్చనీయాంశంగా మారింది.
అయితే విచారణకు హాజరయ్యేందుకు తనకు పది రోజుల సమయం కావాలని రవిప్రకాశ్ తన లాయర్ ద్వారా కోరారు. అయితే రవిప్రకాశ్ చుట్టు ఉచ్చు బిగుస్తోందనే చర్చ సాగుతోంది. తొలుత 160 సీఆర్బీఎస్ నోటీసులు జారీ చేసిన సీసీఎస్ పోలీసులు, ఆ తర్వాత 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. సాధారణంగా నిందితుడిగా పరిగణించ ఆధారాలు నిర్ధారించుకుంటేనే 41 సీఆర్పీసీ నోటీసులు ఇస్తారు. కాబట్టి రవిప్రకాశ్ అరెస్టుకు రంగం సిద్ధమైందని అంటున్నారు. అసలు రవిప్రకాశ్ ఎక్కడున్నారనే చర్చ సాగుతోంది.
మరోవైపు, రవిప్రకాష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టులో దాఖలు చేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. అరెస్ట్ చేస్తారనుకుంటే మళ్లీ రావాలని హైకోర్టు సూచించింది. సీఆర్పీసీ 154 ప్రకారం విచారణ జరపాలని రవిప్రకాష్ తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేయగా, అంత అత్యవసరం కాదని హైకోర్టు అభిప్రాయపడింది.
అలంద మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రయివేటు లిమిటెడ్తో నెలకొన్న వాటాల వివాదంలో రవిప్రకాశ్ పైన సైబరాబాద్ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. టీవీ9 నిర్వహణను అడ్డుకునే ఉద్దేశ్యంతో కొందరితో కలిసి ఫోర్జరీ పత్రాలు సృష్టించారని అలంద మీడియా సంస్థ డైరెక్టర్ కౌశిక్ రావు పోలీసులకు రెండు ఫిర్యాదులు చేశారు. దీనిపై రవిప్రకాశ్, టీవీ9 మాజీ సీఎఫ్ఓ మూర్తి, సినీ నటుడు శివాజీపై కేసులు నమోదు చేశారు.
ఇందులో భాగంగా పోలీసులు ముగ్గురికి 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. మూర్తి మూడు రోజుల పాటు విచారణకు హాజరయ్యాడు. రవిప్రకాశ్, నటుడు శివాజీ నుంచి స్పందన లేదు. దీంతో 41ఏ సీఆర్పీసీ నోటీస్ ఇచ్చారు. ఏదైనా కేసులో వాంగ్మూలం అవసరమైతే పోలీసులు నిందితులకే కాకుండా సాక్ష్యులకు కూడా 160 సీఆర్పీసీ నోటీసులు ఇస్తారు. కానీ నిందితుడిగా పరిగణించదగిన ఆధారాలు ఉన్నాయని నిర్ధారించుకుంటేనే 41ఏ సీఆర్పీసీ నోటీసులిస్తారు.