మైండ్ ట్రీ ఓపెన్ ఆఫర్ వాయిదా
హైదరాబాద్: ఊహించినట్లే మైండ్ ట్రీ కంపెనీలో 31 శాతం వాటా కొనుగోలుకు సంబంధించి ఎల్ అండ్ టీ ప్రతిపాదించిన ఓపెన్ ఆఫర్ వాయిదా పడినట్లుగా సమాచారం. ఐటీ సేవలు అందించే బెంగళూరు కంపెనీని బలవంతంగా చేజిక్కించుకునేందుకు ఎల్ అండ్ టీ కంపెనీ ప్రయత్నాలు మొదలు పెట్టిన విషయం తెలిసిందే.
.అమెరికాకు షాకిచ్చిన చైనా, అయినా పెద్దన్నకు నష్టం లేదు!
ఈ దిశగా ఇప్పటికే మైండ్ ట్రీలో 20 శాతానికి పైగా షేర్లను కేఫ్ కాఫీడే యజమాని సిద్ధార్థ నుంచి కొనుగోలు చేసిన ఎల్ అండ్ టీ... ఇప్పటికే 26 శాతం వాటాను కలిగి ఉంది. తద్వారా తప్పనిసరిగా ఓపెన్ ఆఫర్ ద్వారా మరింత వాటాను కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇందులో భాగంగా 31 శాతం వాటాను రూ.950 (ఒక్కో షేరుకు) వద్ద కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబి) అనుమతిని కోరింది. అయితే సెబి ఇంకా అనుమతులు మంజూరు చేయలేదు.
పైగా ఓపెన్ ఆఫర్కు సంబంధించిన పలు అంశాలపై ఎల్ అండ్ టీ కంపెనీని సెబి ప్రశ్నించిందట. వాటిని నివృత్తి చేసేందుకు ఎల్ అండ్ టీ కాస్త సమయం తీసుకొని మే 10న వివరణ ఇచ్చిందట. అయితే సెబి ఈ వివరణతో సంతృప్తి చెందితే ఒకటి రెండు రోజుల్లో ఓపెన్ ఆఫర్కు అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకుల అభిప్రాయం.
ఓపెన్ ఆఫర్ను సమర్థించాలా వద్దా నే అభిప్రాయం మైండ్ ట్రీ బోర్డుకు ఉంటుందట. తమ వాటాదారులు ఓపెన్ ఆఫర్లోతమ షేర్లను విక్రయించాలా వద్దా అనేది వీరు సూచించే అవకాశం ఉందట. కానీ ఈ సూచన ఎల్ అండ్ టీకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ సెబీ అనుమతులు ఇచ్చేందుకు ఏమీ ఉండదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
కాబట్టి కాస్త ఆలస్యమైనా మైండ్ ట్రీ కంపెనీని ఎల్ అండ్ టీ చేజిక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎల్ అండ్ టీ.. మైండ్ ట్రీ కంపెననీలో 60 శాతానికి పైగా పెంచుకొని పూర్తిస్థాయి ఆధిపత్యం చలాయించాలని చూస్తోంది. ఈ నెల చివరి వారంలో గానీ లేదా వచ్చే నెలలో మొదటి వారంలో గానీ ఎల్ అడ్ టి ఓపెన్ ఆఫర్ ప్రారంభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని మార్కెట్ వర్గాల సమాచారం.