విదేశాలకు వెళ్లేవారికి బిజినెస్ క్లాస్ టికెట్ ధరలు తగ్గించే యోచనలో ఇండిగో
లోబడ్జెట్ విమానాయాన సంస్థ ఇండిగో ఎయిర్లైన తమ టికెట్ ధరలతో ఇప్పటి వరకు దేశీయ ప్రయాణికులను మెప్పించింది. అదే స్థాయిలో లాభాలను చూసింది. తాజాగా ఇదే ఫార్ములాతో యూరప్ ఆసియా మార్కెట్లపై కూడా ఇండిగో కన్నేసింది. ఇందులో భాగంగానే బిజినెస్ క్లాస్ టికెట్ ధరల్లో కోత విధించాలని యోచిస్తోంది.
ప్రస్తుతం ఇండిగో ఇస్తాంబుల్ వరకు సేవలందిస్తోంది. ఇకపై సుదూర ప్రాంతాలకు కూడా తన సేవలను విస్తరించాలని ఆ సంస్థ భావిస్తోంది.మరో ఆరునెలల సమయంలో ఐరోపా దేశాలకు తన సేవలను విస్తరించాలని భావిస్తోందని ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ సీఈఓ రొనొజాయ్ దత్త గతవారం చెప్పారు. తక్కువ ధరకే టికెట్లు, కచ్చితమైన సమయానికి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంతో మార్కెట్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుందని దత్త చెప్పారు. ఈ క్రమంలోనే తక్కువ ధరలకే బిజినెస్ క్లాస్ టికెట్లు ప్రయాణికులకు అందించి తమ సేవలను మరింత విస్తరించాలని భావిస్తున్నట్లు దత్త చెప్పారు. ఏడెనిమిది గంటల పాటు ప్రయాణం చేయాల్సి వస్తే ప్రయాణికులు అలసిపోతారని వారికోసం ఆహారం కూడా అందించాల్సి ఉంటుందని వీటన్నిటిపై చర్చించి త్వరలో బెస్ట్ ప్లాన్తో వస్తామని దత్త చెప్పారు.
ఇక ఇండిగో ఎయిర్లైన్స్ బిజినెస్ క్లాస్ టికెట్ ధరలు ఏమేరకు అందిస్తాయో అనేదానిపై పూర్తి క్లారిటీ లేదు. అంతేకాదు తక్కువ ధరలు అందించడం వల్ల ఇతర అవసరతలపై కూడా ఆలోచించాల్సి ఉంటుందని అన్నారు. ఇక ఇంధనం ధరలే అతిపెద్ద సవాలుగా మారుతోందని దత్త చెప్పారు. ఇక సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే ఇంధన ఖర్చులు చాలా ఎక్కువ అవుతాయని దత్త చెప్పారు. ఇక న్యూఢిల్లీ నుంచి లండన్కు ఒక స్టాప్తో విమానాలు ప్రారంభించాలని భావిస్తున్నట్లు చెప్పిన దత్త.... ఇప్పటికే చూనా, వియత్నాం, మయన్మార్, రష్యాలకు నాన్స్టాప్ విమానాలు నడుపుతున్నట్లు తెలిపారు. కొత్త ఎయిర్బస్లు కొనుగోలు చేసేందుకు ఇప్పటికే చర్చలు ప్రారంభించిందని దత్త చెప్పారు.