లాభం ఒక్క రోజు ముచ్చటే.. మళ్లీ నష్టాల బాటలో సెన్సెక్స్
స్టాక్ మార్కెట్ మళ్లీ నష్టాల బాటే పట్టింది. నిన్న తేరుకున్నట్టు కనిపించినప్పటికీ.. అది అడియాశే అయింది. తీవ్ర ఒడిదుడుకుల మధ్య నిఫ్టీ 11,200 పాయింట్ల దిగువకు పడిపోయింది. ప్రధానంగా జీ ఎంటర్టైన్మెంట్, టాటా మోటార్స్, యెస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ వంటి ప్రధాన స్టాక్స్లో అమ్మకాలు మార్కెట్లను కూలదోశాయి. ఉదయం 11,271 పాయింట్ల దగ్గర ప్రారంభమైన నిఫ్టీ 11286 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. మిడ్ సెషన్ తర్వాత వచ్చిన నీరసం నిఫ్టీని ఏకంగా 11,137 పాయింట్ల కనిష్టానికి పడేసింది. మళ్లీ ఆఖరి గంటలో ప్యానిక్ సెల్లింగ్ జరగడంతో మిడ్, స్మాల్ క్యాప్ సెక్టార్స్ రెండూ ఒక్క శాతం వరకూ నష్టపోయాయి. చివరకు 204 పాయింట్ల నష్టంతో 37,114 దగ్గర సెన్సెక్స్ క్లోజైంది. నిఫ్టీ 65 పాయింట్లు కోల్పోయి 11,157 దగ్గర ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 213 పాయింట్ల నష్టంతో 28616 వద్ద స్థిరపడింది.
సెక్టోరల్ ఇండిసిస్ పరంగా చూస్తే.. కేవలం రియాల్టీ, ఐటీ మినహా అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉంది. వీటిల్లోనూ మీడియా, మెటల్, ఫార్మా, పీఎస్యూ బ్యాంక్స్, ఆటో, రంగ షేర్లు కుప్పకూలాయి.
యెస్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్
యెస్ బ్యాంక్ వ్యవహారంలో ఆర్బీఐ జోక్యం చేసుకుంది. ఆర్థిక అనిశ్చితి, మేనేజ్మెంట్ వ్యవహారంలో అనుమానాల నేపధ్యంలో ఆర్బీఐ.. తన మాజీ గవర్నర్ ఆర్. ఎస్. గాంధీని అదనపు డైరెక్టర్గా నియమించింది. రెండేళ్ల పాటు ఆయన డైరెక్టర్గా కొనసాగబోతున్నారు. దీంతో ఏదో కీడు శంకించిన మార్కెట్ యెస్ బ్యాంక్ షేర్లను వదిలించుకునే ప్రయత్నం చేసింది. ఈ దెబ్బకు షేర్ 52 వారాల కనిష్టానికి (రూ.141.80) పడిపోయింది. చివరకు 142.35 దగ్గర క్లోజైంది.
జీ ఎంటర్టైన్మెంట్ గతీ అంతే
మీడియా ప్యాక్ స్టాక్స్ ఒక్క అడుగు ముందుకు.. మూడు అడుగులు వెనక్కి అనే చందంగా తయారవుతోంది. జీ స్టాక్ మళ్లీ పతనం దిశగా పరుగులు తీసింది. సంస్థ డైరెక్టర్ ఒకరు రాజీనామా చేశారనే వార్తలు ఒత్తిడి పెంచాయి. అయితే ఇందులో వాస్తవం లేదనే జీ ఖండించినప్పటికీ స్టాక్ మాత్రం ఎక్కడా ఆగలేదు. ఒక దశలో 10 శాతానికి పైగా పతనమైన స్టాక్ కొద్దిగా తేరుకుంది. చివరకు స్టాక్ 7 శాతం నష్టంతో రూ.323.10 దగ్గర క్లోజైంది. ట్రేడింగ్ వాల్యూమ్స్ కూడా మూడు రెట్లు పెరిగాయి.
జూబిలెంట్కు రిజల్ట్స్ బూస్టింగ్
మెరుగైన త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన నేపధ్యంలో జూబిలెంట్ స్టాక్ లాభాల్లో ముగిసింది. అమ్మకాల్లో 11 శాతం, నికరలాభంలో 9 శాతం వృద్ధిని సంస్థ నమోదు చేసింది. సేమ్ స్టోర్ సేల్స్ 6 శాతం వరకూ పెరగడం ఊరటనిచ్చే అంశం. శ్రీలంకలో ఉన్న స్టోర్లను నష్టం కారణంగా మూసివేస్తున్నట్టు జూబిలెంట్ ప్రకటించింది. వీటన్నిటి వార్తల నేపధ్యంలో స్టాక్ 3.4 శాతం లాభాలతో రూ.1243 దగ్గర క్లోజైంది.
కరూర్, యూనియన్ బ్యాంక్ డౌన్
నిరుత్సాహక త్రైమాసిక ఫలితాల ప్రకటన నేపధ్యంలో కరూర్ వైశ్యా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ షేర్లు కుప్పకూలాయి. కరూర్ వడ్డీ ఆదాయం 4 శాతం క్షీణించడం, మొండిబకాయిల భారం పెరగడంతో స్టాక్ 6 శాతం నష్టంతో రూ.75 దగ్గర క్లోజైంది.
అదే సమయంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుస నష్టాలతో సతమతమవుతోంది. 2018-19 నాలుగో క్వార్టర్లో బ్యాంక్ నష్టం ఏకంగా రూ.2922.35 కోట్లకు పెరిగింది. అధిక ప్రొవిజన్స్ ఇందుకు కారణమని బ్యాంక్ యాజమాన్యం చెప్పినప్పటికీ స్టాక్ మాత్రం 10 శాతం పడింది. చివరకు రూ.71.45 దగ్గర క్లోజైంది.
టాటా మోటార్స్
స్పష్టమైన కారణమేదీ లేనప్పటికీ టాటా మోటార్స్ స్టాక్ మాత్రం నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. ఈ రోజు కూడా స్టాక్ ఏకంగా 9 శాతం వరకూ పతనమైంది. చివరకు రూ. 171 దగ్గర క్లోజైంది. ఇదే రంగానికి చెందిన స్టాక్స్ అయిన మారుతి, మహీంద్రా అండ్ మహీంద్రా, అశోక్ లేల్యాండ్ కూడా 1.5 నుంచి 2 శాతం వరకూ నష్టపోయాయి.
టైటాన్ @ 1 లక్ష కోట్లు
మార్కెట్లు నిరుత్సాహంగా ఉన్న టైటాన్ స్టాక్ మాత్రం దూకుడు మీదే ఉంది. స్టాక్ ఈ రోజు కూడా 1 శాతం వరకూ లాభపడింది. రూ.1167 ఆల్ టైం మార్కును టచ్ చేసింది. దీంతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1లక్ష కోట్లను దాటింది.