ఇక రిలయన్స్ తర్వాతి టార్గెట్ 50 లక్షల కిరాణా స్టోర్లు! గెట్ రెడీ
థింక్ బిగ్.. పెద్దగా ఆలోచించు.. అనేది ప్రముఖులు చెప్పిన మాట. అయితే ఎవరూ ఊహించనంతగా ఆలోచించు అనేది రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ప్లాన్. ఇప్పటికే ఉప్పు, పప్పులు, బట్టలు, చెప్పులు, జ్యువెల్రీ, మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్, క్రూడాయిల్, పాలిస్టర్, క్లాతింగ్, రిఫైనరీ.. వంటి వివిధ విభాగాల్లో ఉన్న సంస్థ తాజాగా కిరాణా స్టోర్లను టార్గెట్ చేయబోతోంది. అయితే రిలయన్స్ నేరుగా కిరాణా షాప్స్ పెట్టడం లేదు.. అనేది మనం గమనించాల్సిన అంశం. ఇప్పుడు 15వేల షాపులతో మొదలుపెట్టి.. దేశంలో ఉన్న 50 లక్షల కిరాణా స్టోర్లను డిజిటలైజ్ చేసి.. తన వ్యాపారాన్ని మరింత విస్తరించుకునే వ్యూహంతో సిద్ధమైంది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇదే విషయాన్ని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్లించ్ తన అధ్యయనంలో వివరించింది.
ఆయిల్ రిఫైనరీని మూసివేయనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్!!
కిరాణా షాపులనీ వదలరా ?
కిరాణాను మన దేశంలో చిన్నచూపు చూడలేం. ఎందుకంటే మన దేశ రిటైల్ మార్కెట్ విలువ 700 బిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో రూ.49 లక్షల కోట్లు. అవును మీరు చదివింది నిజమే.. దీని విలువ సుమారు రూ.50 లక్షల కోట్లు. ఇంత పెద్ద మార్కెట్ను ఎవరు మాత్రం కాదనుకుంటారు. అందుకే మన చుట్టుపక్కల ఉన్న షాపులకు అంత డిమాండ్. అయితే వీటిని కేవలం ఉప్పు, పప్పు వంటి పచారీ సామాన్లు అమ్మే వాటికే పరిమితం చేయకుండా వీటిని పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేసి.. వ్యాపారాన్ని పెంచాలనేది ముకేష్ అంబానీ టార్గెట్. ఇందుకోసం వాళ్లందరికీ అతి తక్కువ ధరలో జియో మొబైల్ పాయింట్ ఆఫ్ సేల్ (జియో MPoS)ను అందించబోతోంది. దీనికి హై స్పీడ్ 4జీ కనెక్టివిటీ కూడా ఇవ్వబోతున్నారు.
డిజిటల్ మయం
ఓ మాదిరి కిరాణా షాపులో బిల్స్ ఇవ్వడం, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ వంటివి ఉండవు. ఏం వచ్చాయో.. ఎంతసరుకు ఇంకా ఉందో, ఏ సరుకు ఎక్కువగా అమ్ముడవుతోందో, ఎప్పుడే దేన్ని ఆర్డర్ చేయోలో అనే అంశాలను పట్టించుకోవడం కష్టం. ఉన్న ఓనర్ ఫిజికల్గా వాటిని చూసుకోవాలి. కానీ ఇక్కడ అలాంటి తలనొప్పి ఉండదు. రిలయన్స్కు మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తే.. ఇక అది షాప్ ఇన్వెంటరీలో చేరిపోతుంది. బిల్స్ జనరేట్ అయినప్పుడు అదే మేనేజ్మెంట్ చూసుకుంటుంది. ఇక జీఎస్టీ తలనొప్పి లేకుండా నెలవారీ రిసీట్స్, ట్యాక్స్ స్టేట్మెంట్ వంటివి కూడా అదే చూసుకుంటుంది. ఇది ఓ మోస్తరు కిరాణా షాపులకు
బాగా పనికొస్తుంది. ఇప్పుడు నుక్కడ్, స్నాప్ బిజ్, గో ఫ్రూగల్ వంటి సంస్థలు మాత్రమే ఈ తరహా సాఫ్ట్వేర్, హార్డ్వేర్ను ఆఫర్ చేస్తున్నాయి. ఇవన్నీ రూ.15 వేల నుంచి రూ.1 లక్ష వరకూ ఛార్జ్ చేస్తున్నాయి. కానీ.. ఇవేవీ లేకుండా కేవలం రూ.3 వేలకే రిలయన్స్ రిటైల్ మరిన్ని సదుపాయాలను అందించబోతోంది. దీని వల్ల లక్షలాది కిరాణా షాపులు కూడా రిలయన్స్ పరిధిలోకి వచ్చేస్తాయి.
ఇదీ ఫ్యూచర్ టార్గెట్
ఇప్పుడు రిలయన్స్ రిటైల్కు దేశవ్యాప్తంగా 10 వేల రిటైల్ ఔట్లెట్లు ఉన్నాయి. అవి అంతకు మించి విస్తరించడం కొద్దిగా కష్టం. అందుకే ఈ రూట్ను ఎంచుకుంది రిలయన్స్. మీకు రిలయన్స్ రిటైల్ నుంచి ఏవైనా చెప్పులో, బూట్లో, లేకపోతే ఏదైనా అక్కడ దొరికే సరుకో కావాలని అనుకుందాం. అప్పుడు మీరు దగ్గర్లో ఉన్న కిరణాషాపు వెళ్లి వాళ్ల దగ్గర ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. లేకపోతే వాళ్లకు డబ్బులు ఇవ్వొచ్చు. వెంటనే మీకు కావాల్సిన ఆర్డర్ మీ ఇంటి పక్కనున్న కిరాణా షాపునకు లేదా.. మీ ఇంటికే డెలివర్ అయిపోతుంది. దీనివల్ల కస్టమర్కు మరింత కాన్ఫిడెన్స్ రావడంతో పాటు ఇంటర్నెట్ను వినియోగించలేని వాళ్ల మార్కెట్ను కూడా కొల్లగొట్టినట్టు అవుతుంది.