జాన్సన్&జాన్సన్ బేబీ షాంపూలు అమ్మొద్దు: చైల్డ్ రైట్స్ బాడీ
జాన్సన్ బేబీ షాంపూ అమ్మకాలను నిలిపివేయాలని బాలల హక్కుల సంస్థ రాష్ట్రాలకు సూచించింది. ప్రయోగ పరీక్షలో ప్రమాణాలు పాటించలేదని తేలినందునే ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) జాన్సన్ బేబీ షాంపూ విక్రయాల్ని ఆపేయాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. దుకాణాల నుంచి వాటి నిల్వలను తొలగించాలని చీఫ్ సెక్రటరీలకు లేఖ రాసింది.
చివరి ఒక అవకాశం: ఆర్బీఐకి సుప్రీం కోర్టు వార్నింగ్
షాంపూ నమూనాల్ని ల్యాబ్లో పరీక్షించగా, ప్రామాణిక నాణ్యత లేదని తేలిందని పేర్కొంది. జైపూర్ డ్రగ్ టెస్టింగ్ లాబొరేటరీ ధ్రువీకరించిందని ఎన్సీపీసీఆర్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల నుంచి జాన్సన్ బేబీ షాంపూ, టాల్కమ్ పౌడర్ నమూనాలను సేకరించామని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ (దక్షిణాది), జార్ఖండ్ (ఈస్ట్), రాజస్థాన్ (వెస్ట్), మధ్యప్రదేశ్ (సెంట్రల్), అసోం (నార్త్ ఈస్ట్) నుంచి నమూనాలను సేకరించామని పేర్కొంది. ఈ క్రమంలోనే రాజస్థాన్ ల్యాబ్ టెస్ట్లో షాంపూ నాణ్యత లోపాలు వెలుగు చూశాయని పేర్కొంది. మిగతా రాష్ట్రాలలోని ల్యాబ్ల నుంచి పరీక్షా ఫలితాలు రావాల్సి ఉందని తెలిపింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశామని తెలిపింది.
టాల్కమ్ పౌడర్ పరీక్షలకు సంబంధించిన వివరాలు కూడా త్వరగా ఇవ్వాలని రాజస్థాన్ డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్ను అడిగినట్లు ఎన్సీపీసీఆర్ తెలిపింది. కాగా, క్యాన్సర్ కారకాలు, ఇతరత్రా హానికర అవశేషాలున్నాయన్న వార్తల నేపథ్యంలోనే ఈ పరీక్షలను నిర్వహించారు.