క్యాన్సర్తో బాధపడుతున్న జెట్ ఎయిర్వేస్ ఉద్యోగి ఆత్మహత్య
ముంబై: జెట్ ఎయిర్వేస్ సంక్షోభం ఆ కంపెనీ ఉద్యోగులను ఒత్తిడిలోకి నెడుతోంది. పలువురు పైలట్లు, కో-పైలట్లు, టెక్నీషియన్స్, ఇతర ఉద్యోగులు ఇతర సంస్థలను ఆశ్రయిస్తున్నారు. తాజాగా, జెట్కు చెందిన సీనియర్ టెక్నీషియన్ మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ఈ కారణంగా డిప్రెషన్లో అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
జెట్ ఎయిర్వేస్ ఎఫెక్ట్: ప్రపంచ టాప్ 10 సంస్థల్లో ఇండిగో, స్పైస్జెట్కు అదే ప్లస్
ఆత్మహత్య చేసుకున్న సీనియర్ టెక్నీషియన్ పేరు శైలేష్ సింగ్ (45). శుక్రవారం మధ్యాహ్నం అతను తాము ఉండే నాలుగంతస్తుల భవనం టెర్రాస్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. జెట్ క్లోజ్ నేపథ్యంలో శైలేష్ సింగ్ ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారని కూడా తోటి ఉద్యోగులు అంటున్నారు. నాలుగు నెలలుగా వేతనం రాకపోవడం ఇబ్బందులకు కారణమని చెబుతున్నారు.
కాగా, ఇతర సంస్థలను ఆశ్రయిస్తున్న జెట్ ఉద్యోగులకు అవమానాలు ఎదురవుతున్నాయట. స్పైస్జెట్ సీనియర్ అధికారి ఒకరు ఇంటర్వ్యూలో తమతో అగౌరవంగా మాట్లాడారని జెట్ ఎయిర్వేస్ పైలట్లు ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జెట్ పైలట్ల సంఘం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఉద్యోగం కోసం వెళ్లిన జెట్ పైలట్లతో సదరు అధికారి తాము సానుభూతితోనే ఈ నియామకాలను చేపట్టామని అన్నారట. దీనినో ఛారిటీగా అభివర్ణించారని జెట్ పైలట్ల సంఘం పేర్కొంది.