చివరి ఒక అవకాశం: ఆ జాబితా ఇవ్వాల్సిందే... ఆర్బీఐకి సుప్రీం కోర్టు వార్నింగ్
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి సుప్రీం కోర్టు శుక్రవారం వార్నింగ్ ఇచ్చింది. బ్యాంకులకు చెందిన వార్షిక తనిఖీ నివేదికలను వెల్లడించాలని ఆదేశించింది. ఇందులో భాగంగా డిఫాల్టర్స్ జాబితాను కూడా అందించాలని పేర్కొంది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద సమాచారం అడిగితే వార్షిక నివేదికతో పాటు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన వారి జాబితాను కూడా బయటపెట్టాలని చెప్పింది.
ఇద్దరు ఆర్టీఐ కార్యకర్తలు వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు స్వీకరించి, ఈ వ్యాఖ్యలు చేసింది. వార్షిక తనిఖీ నివేదికను బ్యాంకులు విడుదల చేయాలని జనవరి నెలలో నోటీసులు కూడా సుప్రీం కోర్టు జారీ చేసింది. జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. ఆర్టీఐ చట్టం ప్రకారం వివరాలను తెలుపాలని కోర్టు కోరింది. ఒకవేళ ఆదేశాలను బేఖాతరు చేస్తే తర్వాత ధిక్కరణ కేసును ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది.
ఆర్బీఐ నాన్ డిస్క్లోజర్ పాలసీని విత్ డ్రా చేసుకోవాలని, అది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని పేర్కొంది. అత్యున్నత కోర్టు ఆదేశాలు పాటించేందుకు ఒక చివరి అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది. చట్టం ప్రకారం నడుచుకోకుంటే కోర్టు ధిక్కరణ కింద ఆర్బీఐపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఆర్టీఐ యాక్టివిస్ట్లు గిరీష్ మిట్టల్, సుభాష్ చంద్ర అగర్వాల్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆర్టీఐ చట్టం కింద వివరాలు ఇవ్వడం లేదని ఆర్బీఐపై కోర్టుకెక్కారు. 2015 డిసెంబర్లో పిటిషనర్ ఆర్టీఐ చట్టం కింద సమాచారం కోరారు.