ఎయిర్టెల్కు రిలయన్స్ జియో షాక్: రెండు దశాబ్దాల్లో 1 నుంచి 3కు
టెలికం రంగంలో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో దూసుకెళ్తోంది. సబ్స్క్రైబర్స్ జాబితాలో భారతీ ఎయిర్టెల్ను దాటేసి, రెండో అతిపెద్ద కంపెనీగా అవతరించింది. రిలయన్స్ జియోకు 30.6 కోట్ల మంది కస్టమర్లు ఉండగా, ఎయిర్టెల్కు 28.4 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. జియో కంటే ముందు వొడాఫోన్ - ఐడియా తొలి స్థానంలో ఉంది. దీనికి 38.7 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. ఈ లెక్క డిసెంబర్ 2018 నాటికి.
లోకసభ ఎన్నికలు: అత్యధిక ధనవంతుడు గౌతమ్ గంభీర్, రూ.147 కోట్ల ఆస్తులు
ఇంతకుముందు వరకు వొడాఫోన్ - ఐడియా తొలి స్థానంలో, ఎయిర్టెల్ రెండో స్థానంలో ఉండగా, అత్యుత్తమ ప్యాకేజీతో ఇటీవలే దూసుకొచ్చిన జియో ఎయిర్టెల్ను మూడో స్థానానికి పడేసింది. కాగా, రిలయన్స్ జియో త్వరలో వొడాఫోన్-ఐడియాను కూడా దాటేసి అగ్రస్థానానికి చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. వచ్చే మూడు నుంచి నాలుగు త్రైమాసికాల్లో జియో.. వొడాఫోన్ ఐడియాను వెనక్కు నెట్టేయవచ్చని భావిస్తున్నారు.
భారతీ ఎయిర్టెల్ ఇండియన్ టెలికం రంగాన్ని దాదాపు రెండు దశాబ్దాల పాటు శాసించింది. అయితే ఇప్పుడు ఈ కంపెనీ అనూహ్యంగా మూడో స్థానంతో సరిపెట్టుకుంది. వొడాఫోన్-ఐడియా విలీనంతో ఎయిర్టెల్ రెండో స్థానానికి వచ్చింది. ఇప్పుడు జియో కారణంగా మూడో స్థానానికి పడిపోయింది.
రిలయన్స్ జియో 2016 సెప్టెంబర్లో లాంచ్ చేశారు. మొబైల్ డాటా, కాల్ డాటాలో ఇది మిగతా టెలికం ప్రొవైడర్లకు సవాల్గా నిలిచింది. దీంతో ఎక్కువమంది కస్టమర్లు జియో వైపు ఆకర్షితులవుతున్నారు.
సరికొత్త టారిఫ్ ప్లాన్స్తో జియో కస్టమర్లను ఆకట్టుకుంటోందని ఫిన్ఎక్స్ప్రో కన్సల్టెన్సీ కంపెనీ సీఈవో మోహన్ శుక్లా తెలిపారు. జేపీ మోర్గాన్ రిపోర్ట్ ప్రకారం 2019 జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో జియోకు 2.7 కోట్ల మంది కొత్త యూజర్లు వచ్చారు.