హెచ్డీఎఫ్సీ జోరు: మార్చి త్రైమాసికానికి రూ.5,885 కోట్ల భారీ లాభం
ప్రయివేటురంగానికి చెందిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్చి త్రైమాసికానికి ఫలితాలను ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 22.6 శాతం నికర లాభాల్లో వృద్ధి కనిపించింది. ఈ సీజన్లో రూ.5,805 కోట్ల లాభాన్ని విశ్లేషకులు అంచనా వేయగా అది రూ.5,885 కోట్లకు పెరిగింది. ఒక త్రైమాసికంలో ఇంతటి స్థాయి లాభాలను ఆర్జించడం ఇదే తొలిసారి. గత ఏడాది ఇదే సమయంలో రూ.4,799 కోట్ల లాభాన్ని ప్రకటించింది.
వడ్డీల రూపంలో వచ్చిన ఆదాయం 22.8 శాతం పెరిగి రూ.13,089 కోట్లకు చేరుకుంది. గత త్రైమాసికంతో నికర వడ్డీ మిగులు రూ.4.4 శాతానికి చేరుకుంది. అదే సమయంలో మొండిబకాయిల ప్రొవిజన్లు కూడా రూ.1,541 కోట్ల నుంచి రూ.1,889 కోట్లకు చేరుకున్నాయి. ఆస్తుల విషయానికి వస్తే ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) స్థూల రుణాల్లో 1.36 శాతంగా ఉన్నాయి. గత ఏడాది ఇది 1.30 శాతంగా ఉంది. నికర ఎన్పీఏలు 0.40 శాతం నుంచి 0.30 శాతానికి తగ్గాయి. ఎన్పీఏలను పూడ్చుకోవడానికి రూ.1,451 కోట్ల నిధులను వెచ్చించింది.
SBI కార్పోరేట్ శాలరీ అకౌంట్: అర్హత, లాభాలు తెలుసుకోండి
2019 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు డైరెక్టర్ల బోర్డు ఒక్కో షేరుపై రూ.15 డివిడెండ్ను సిఫారసు చేసింది. ఈ డివిడెండ్కు త్వరలో జరుగనున్న వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారుల అనుమతిని బ్యాంక్ తీసుకోనుంది. టైర్ 1, టైర్ 2 క్యాపిటల్ బాండ్లు, దీర్ఘకాలిక బాండ్లను జారీ ద్వారా రానున్న 12 నెలల్లో రూ.50 వేల కోట్ల నిధుల సేకరణకు బోర్డ్ ఆమోదం తెలిపింది. కాగా, గడిచిన ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ రూ.782.1 కోటి ఆదాయంపై రూ.329.8 కోట్ల లాభాన్ని గడించింది. అంతక్రితం వచ్చిన ఏడాదితో పోల్చుకుంటే నికర లాభం స్వల్పంగా తగ్గింది.