యూనికార్న్ క్లబ్లో చేరిన తొలి ఇండియన్ గేమింగ్ కంపెనీ డ్రీమ్11
ముంబైకి చెందిన ఫాంటసీ గేమింగ్ స్టార్టప్ డ్రీమ్11(Dream11) ఇండియన్ యూనికార్న్ క్లబ్లో చేరింది. 1 బిలియన్ డాలర్లకు పైగా విలువ కలిగిన స్టార్టప్స్ను యూనికార్న్స్గా పేర్కొంటారు. డ్రీమ్11 కొత్త కంపెనీ అయినప్పటికీ అతి త్వరగా సత్తా చాటింది. క్రీడా అభిమానులు ఎంతోమంది డ్రీమ్11 ఉపయోగిస్తుంటారు.
మొబైల్ నెంబర్ లేకుండా ఆధార్ కార్డు వివరాలు ఎలా మార్చుకోవాలి?
హర్ష్ జైన్, భవితా సేథ్ 2008లో డ్రీమ్11 స్థాపించారు. డ్రీమ్11లో క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ, నేషనల్ బాస్కెట్ అసోసియేషన్ (ఎన్బీఐ) కేటగిరీలు ఉన్నాయి. తమకు 50 మిలియన్ యూజర్స్ ఉన్నట్లుగా పేర్కొంది. ఫాంటసీ గేమింగ్ ద్వారా వారి క్రీడా పరిజ్ఞానం ప్రదర్శనకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
డ్రీమ్11 ఫ్యాంటసీ కంపెనీ వ్యాల్యుయేషన్ 1.5 బిలియన్ డాలర్లలోపు ఉండవచ్చు. హాంగ్కాంగ్కు చెందిన స్టీడ్వ్యూ క్యాపిటల్ అనే సంస్థ డ్రీమ్11 కంపెనీలో వాటాను కొనుగోలు చేసింది. దీంతో కంపెనీ విలువ ఒక బిలియన్ డాలర్లకు పైకి చేరింది. చైనాకు చెందిన టెన్సెంట్ కంపెనీ ఏడు నెలల క్రితం డ్రీమ్11లో వంద మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టింది. అప్పుడు కంపెనీ విలువ 700 మిలియన్ డాలర్లుగా ఉంది.
కలారి క్యాపిటల్, మల్టీపుల్స్ అల్టర్నేటివ్ అసెట్ మేనేజ్మెంట్, థింక్ ఇన్వెస్ట్మెంట్స్ అనే సంస్థలు తమ వాటాలను స్టీడ్వ్యూ క్యాపిటల్కు విక్రయించాయని డ్రీమ్11 తెలిపింది. ఈ కంపెనీ గత మూడేళ్లలో సీఏజీఆర్లో 230 శాతం పెరుగుదల ఉన్నట్లు పేర్కొంది. ఈ కంపెనీ తొలి మూడు మిలియన్ యూజర్లను చేరుకునేందుకు మూడేళ్లు పట్టగా, ఆ తర్వాత రెండు నెలల్లోనే మరో మూడు మిలియన్లకు చేరుకుంది. పదేళ్ల కష్టం ఫలితమని కంపెనీ సీవోవో భవితా సేథ్ అన్నారు.