మార్కెట్లను పడేసిన ఐటీ, బ్యాంక్ స్టాక్స్ ! మళ్లీ నష్టాల్లో ముగింపు
జోరుమీదున్న మార్కెట్లకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. నిఫ్టీ, సెన్సెక్స్లు ఆఖరి గంటలో ఉక్కిరిబిక్కిరై నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 39 వేల పాయింట్ల దిగువన, నిఫ్టీ 11700 పాయింట్ల కింద క్లోజవడం కొద్దిగా సెంటిమెంట్ను నీరసపరిచింది. ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టాలు మార్కెట్లను నిరాశపరిచాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ ప్రకటన అనంతరం మార్కెట్లు దిగాలుపడ్డాయి. పావు శాతం వడ్డీరేట్లను మార్కెట్ ఈ పాటికే డిస్కౌంట్ చేసిన నేపధ్యంలో సూచీలు నీరసించాయి. చివరకు సెన్సెక్స్ 193 పాయింట్లు నష్టంతో 38,685 దగ్గర, నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో 11598 దగ్గర ముగిసింది.
ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, జీఎంటర్టైన్మెంట్, టాటా మోటార్స్, హీరోమోటో కార్ప్, అల్ట్రాటెక్ సిమెంట్ స్టాక్స్ టాప్ 5 గెయినర్స్గా నిలిచాయి. టీసీఎస్, హిందాల్కో, బీపీసీఎల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యెస్ బ్యాంక్ స్టాక్స్ టాప్ 5 లూజర్స్ జాబితాలో చేరాయి.
గో.. గో.. గో..ఇండిగో
ఇండిగో స్టాక్ మరోసారి గాల్లోకి లేచింది. తాజాగా జెట్ ఎయిర్కు చెందిన మరో 12 ఫ్లైట్స్ గ్రౌండ్కే పరిమితమయ్యాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా అతి తక్కువ ఫ్లీట్తో జెట్ సేవలందిస్తోంది. ఇది ప్రత్యక్షంగా ఇండిగో వంటి సంస్థలకు లాభం చేకూరుస్తుంది కాబట్టి ఈ స్టాక్ దూసుకుపోయింది. ఈ స్టాక్ 5 శాతం పెరిగి రూ.1433 దగ్గర క్లోజైంది.
జీ ఎంటర్టైన్మెంట్పై కన్నేసిన జియో, ఎయిర్టెల్
జీ ఎంటర్టైన్మెంట్ గ్రూపులో వాటా కొనుగోలు చేసేందుకు ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, మిట్టల్కు చెందిన ఎయిర్టెల్ బిడ్స్ దాఖలు చేయబోతున్నాయి. జీ సుభాష్ చంద్రకు చెందిన వాటాను కొనుగోలు చేయడానికి వీళ్లు ఉత్సాహం చూపిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న అప్పులను తీర్చుకోవడానికి సుభాష్ చంద్రకు ఇదొక్కటే ఆప్షన్గా కనిపిస్తోంది. ఈ వార్తల నేపధ్యంలో జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ 3.3 శాతం పెరిగి రూ.418 దగ్గర ముగిసింది.