న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో దెబ్బ తగిలింది. అదే సమయంలో కార్పోరేట్లకు భారీ ఊరట లభించింది. గత ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన ఆర్బీఐ కొత్త సర్క్యులర్ జారీ చేసింది. రుణాల చెల్లింపుకు ఒక్కరోజు ఆలస్యమైనా ఆ సంస్థ దివాళా తీసినట్లుగా పరిగణించాలని అందులో పేర్కొంది. దీనిపై పలు కార్పోరేట్ సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. ఈ కేసు తొలుత అలహాబాద్ హైకోర్టు, అక్కడి నుంచి సుప్రీం కోర్టుకు వెళ్లింది. తాజాగా, మంగళవారం ఆర్బీఐ సర్క్యులర్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఆర్బీఐ సర్క్యులర్ ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తి కంపెనీలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీంతో ఆ కంపెనీలు కోర్టును ఆశ్రయించాయి. ఈ తీర్పు వారికి ఊరటనిచ్చింది. ఈ సర్క్యులర్ను ఆర్బీఐ తన అధికారానికి వెలుపల జారీ చేసినట్లుగా ప్రకటిస్తున్నామని సుప్రీం కోర్టు పేర్కొంది.

ఏమిటీ ఈ ఆర్బీఐ సర్క్యులర్?
గడువు తర్వాత ఒక్కరోజు కూడా బకాయి చెల్లించకపోయినా ఆ కంపెనీని దివాలా సంస్థగా ప్రకటించేందుకు వీలు కల్పించే నిబంధనలతో ఆర్బీఐ గతంలో సర్క్యులర్ జారీ చేసింది. తీసుకున్న రుణాలకు సంబంధించి చెల్లింపుల్లో ఒక్కరోజు ఆలస్యమైనా సదరు రుణగ్రహీతలను రుణదాతలు (బ్యాంకర్లు) డిఫాల్టర్లుగా ప్రకటించాలి. ఆర్బీఐకి వివరాలు ఇవ్వాలి. రిజల్యూషన్ (పరిష్కార ప్రణాళిక) ప్లాన్ అమలు చేయాలి. రూ.2,000 కోట్లు, అంతకుమించిన రుణాల్లో డిఫాల్టర్ ఐతే పరిష్కార ప్రణాళికకు 180 రోజుల సమయం ఉంటుంది. గడువులోగా పరిష్కారం లభించకుంటే ఆ నిరర్థక ఆస్తుల ఖాతాలను నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ లేదా దివాలా కోర్టుకు సిఫార్సు చేయాలని ఆర్బీఐ పేర్కొంది. కార్పొరేట్ రుణ పునర్వ్యవస్థీకరణ, వ్యూహాత్మక రుణ పునర్వ్యవస్థీకరణ, ఒత్తిడితో కూడిన రుణాల సుస్థిర నిర్మాణం వంటి చర్యలకు బ్యాంకులు వెళ్లవద్దు. దివాలా చట్టంతోనే ముందుకు వెళ్లాలి. వివరాలను ఎప్పటికి అప్పుడు ఆర్బీఐకి ఇవ్వాలి. మార్గదర్శకాల అమలులో విఫలమైతే బ్యాంకులపై జరిమానా ఉంటుంది. ఆర్బీఐ ఫిబ్రవరి 12, 2018న ఈ సర్క్యులర్ జారీ చేసింది.

అసలు ఏం జరిగింది?
ఈ సర్క్యులర్ ప్రభావం విద్యుత్ కంపెనీలపై ఎక్కువగా పడింది. ఇతర రంగాలకు చెందిన సంస్థల పైనా పడింది. దీంతో జీఎంఆర్ ఎనర్జీ, రాటన్ ఇండియా పవర్, అసోసియేషన్ ఆఫ్ పవర్ ప్రొడ్యూసర్, ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, తమిళనాడుకు చెందిన షుగర్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్, గుజరాత్ నౌకా నిర్మాణ సంఘం ఈ సర్క్యులర్పై కోర్టుకు ఎక్కాయి. సుప్రీం తీర్పు వీరికి ఊరటనిచ్చింది. కాగా, ఇంధన కొరత, బొగ్గు బ్లాక్స్ రద్దు కారణంగా విద్యుత్ రంగంలో రూ.5.65 లక్షల కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. ఈ బకాయిలు మార్చి 2018 నాటికే అంత మొత్తం ఉన్నాయి. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు కొనసాగించలేకపోవడంతో పాటు తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించలేక పోయాయి. దీంతో గత ఏడాది సెప్టెంబర్ 11వ తేదీన కంపెనీలు కోర్టు దృష్టికి తీసుకువెళ్లాయి. బకాయిలను చెల్లించడంలో విఫలం కావడంతో బ్యాంకులు తమపై దివాలా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయని, ప్రస్తుతానికి యథాతథ పరిస్థితి కొనసాగేలా బ్యాంకులను ఆదేశించాలని కోరాయి. యథాతథ స్థితి కొనసాగించాలని బ్యాంకులను సుప్రీం కోర్టు కూడా అప్పుడే కోరింది. ఇప్పుడు సర్క్యులర్ కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.

ఇప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయి?
ఆర్బీఐ జారీ చేసిన సర్క్యులర్ రద్దు కావడంతో మొండి బకాయిలపై ఆయా బ్యాంకులదే తుది నిర్ణయం కానుంది. డిఫాల్టర్లను ఎన్సీఎల్టీ(నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్)కు పంపించే అంశంలో బ్యాంకులే నిర్ణయించి, క్రమంగా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. దీనిపై ఎస్పీఐ చీఫ్ రజనీష్ కుమార్ మాట్లాడుతూ... సుప్రీం కోర్టు కేవలం ఆర్బీఐ సర్క్యులర్ను మాత్రమే రద్దు చేసిందని, మొండి బకాయిలపై ఎన్సీఎల్టీకి వెళ్లేందుకు బ్యాంకర్లకు ఉన్న హక్కును రద్దు చేయలేదని చెప్పారు. బ్యాంకులు సొంతగా నిర్ణయం తీసుకోవచ్చని, ఆర్బీఐకి జవాబుదారిగా ఉండాలన్నారు. ఇదిలా ఉండగా, దివాలా స్మృతి చట్టం కింద తాము రిజల్యూషన్ కొనసాగిస్తామని బ్యాంకర్లు చెబుతున్నారు.

బ్యాంకర్లకు దెబ్బ
ఈ తీర్పుతో విద్యుదుత్పత్తి కంపెనీలపై చేపట్టిన దివాలా చర్యల్లో జాప్యం ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని, ఆర్బీఐ ఆర్బీఐ సర్క్యులర్ను కొట్టివేయటంతో రుణాల పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి రుణదాతలకు వెసులుబాటు లభించిందని అంటున్నారు. మొత్తంగా సుప్రీం తీర్పు బ్యాంకులకు గట్టి దెబ్బ అంటున్నారు. సుప్రీం తీర్పుతో రుణ తీర్మాన ప్రక్రియ ఆలస్యమై, దీని వల్ల బ్యాంకుల రేటింగ్ ఇబ్బందుల్లో పడే అవకాశముందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. బ్యాంకులకు రుణాల వసూళ్లు మందగిస్తాయని చెబుతున్నారు. ఇది బ్యాంకులకు ఆర్థికంగా కష్టాలు అంటున్నారు. బ్యాంకుల క్రెడిట్ రేటింగ్కు ఈ తీర్పు ప్రతికూలం అని మూడిస్ పేర్కొంది. మరోవైపు, ఆర్బీఐ సర్క్యులర్ కారణంగా ఇలాంటి కఠిన నిబంధనలతో కూడా మొండి బకాయిలు అంతకంతకు పెరిగి, బ్యాంకుల లాభాలు పడిపోతాయనే వాదనలు కూడా ఉన్నాయి. కార్పోరేట్ కంపెనీలు కోర్టులకు క్యూ కడతాయని అంటున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications