నరేష్ గోయల్, భార్య అనితా రాజీనామా: దూసుకెళ్లిన జెటి ఎయిర్వేస్ షేర్లు
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకులు నరేష్ గోయల్, ఆయన సతీమణి అనితా సోమవారం ఎయిర్ లైన్స్లో తమ తమ పదవులకు రాజీనామా చేశారు. వీరిద్దరు బోర్డు నుంచి వైదొలిగారు. దాదాపు పాతిక సంవత్సరాల క్రితం 1993లో గోయల్ తన సతీమణి అనితతో కలిసి జెట్ ఎయిర్వేస్ను ఏర్పాటు చేశారు. పాతికేళ్ల పాటు ఈ సంస్థను నడిపిన వీరిద్దరు ఇప్పుడు బోర్డు నుంచి తప్పుకున్నారు.
జెట్ ఎయిర్వేస్ బోర్డు నుంచి నరేష్ గోయల్ తప్పుకోవడంతో చాలా రోజుల తర్వాత ఈ సంస్థ షేర్లు పురోగమిస్తున్నాయి. జెట్ ఎయిర్వేస్ ఆర్థిక సంక్షోభంలో ఉండటం, గోయల్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని రుణాలు ఇచ్చిన ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్టియం ఒత్తిడి చేసిన నేపథ్యంలో జెట్ షేర్లు నష్టాల్లో కూరుకుపోయాయి. ఆయన తప్పుకున్న అనంతరం ఇవి కోలుకున్నాయి.
జెట్ ఎయిర్వేస్లో కీలక పరిణామం: నరేష్ గోయల్, అనిత రాజీనామా
నరేష్ గోయల్, తన భార్య అనిత డైరెక్టర్ల బోర్డుకు రాజీనామా చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సంస్థలో గోయల్ కుటుంబానికి 51 శాతం వాటా ఉంది. గత కొంతకాలంగా జెట్ ఎయిర్వేస్ పరిస్థితి దారుణంగా ఉంది. ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి వచ్చింది. చివరకు లీజు చెల్లించలేక విమానాలు నిలిపివేయాల్సిన వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత యాజమాన్యంతో జెట్ ఎయిర్వేస్ నిర్వహణ కొనసాగడం కష్టమని ఇటీవల ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం వెల్లడించింది. సంస్థ పునరుద్ధరణ కోసం వృత్తి నిపుణుల చేతికి అప్పగించడమే మంచిదని ప్రతిపాదించింది. బ్యాంకర్ల ఒత్తిడితో నరేశ్ గోయల్ రాజీనామా చేయడం అనివార్యమైంది.
దూసుకెళ్లిన షేర్లు
నరేష్ గోయల్, ఆయన సతీమణి అనితా గోయల్లు ఈ రోజు తప్పుకుంటారని ప్రచారం సాగింది. ఈ ప్రచారం నిజమేనన్నట్లు వారు కూడా తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో జెట్ షేర్లు చివరి నిమిషంలో 12 నుంచి 15 శాతానికి పైగా పెరిగాయి. అంతకుముందు రోజు బీఎస్ఈలో 225 వద్ద జెట్ ఎయిర్వేస్ షేర్లు క్లోజ్ కాగా, ఈ రోజు షేర్లు 254.50 వద్ద ముగిశాయి.
జెట్ ఎయిర్వేస్లో గోయల్ తన వాటాని 51 శాతం నుంచి తగ్గించుకోనున్నారు. అలాగే, అబుదబీకి చెందిన ఎతిహాద్ విమనయాన సంస్థ తన 24 శాతం వాటాను ఎస్బీఐకి ఇస్తానని ఆఫర్ ఇచ్చింది. ఇప్పుడు ఆ వాటాలో 12 శాతం వాటాను అట్టిపెట్టేందుకు సిద్ధపడిందని తెలుస్తోంది.