పెరుగుతున్న డెబిట్ కార్డులు, తగ్గుతున్న ఏటీఎంలు: ఇబ్బందులకు కారణాలివే
న్యూఢిల్లీ: ఓ వైపు డెబిట్ కార్డుల జారీ పెరుగుతుంటే, ఏటీఎంల సంఖ్య మాత్రం తగ్గుతోందట. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను జనవరి వరకు అంటే పది నెలల్లో ఏటీఎంలు చాలా వరకు తగ్గాయి. అదే సమయంలో ఖాతాదారులు, వారికి జారీ చేసే డెబిట్ కార్డులు అంతకంతకు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ పది నెలల్లో 399 ఏటీఎం సెంటర్లు తగ్గాయి. 2,21,848 ఏటీఎంలు ఉన్నాయి. అదే సమయంలో ఈ పది నెలల్లో డెబిట్ కార్డుల జారీ ఏడు కోట్లు. 2019 జనవరి నాటికి డెబిట్ కార్డులు ఉన్నవారి జాబితా 93 కోట్లకు చేరుకుంది.
ఏటీఎంలో డబ్బులు రాకపోతే ఇలా చేయండి
పెరుగుతున్న ఏటీఎం కార్డులు, తగ్గుతున్న ఏటీఎంలు
బ్యాంక్ ఖాతాలు తీసుకుంటున్న వారిలో ఎక్కువ శాతం మంది ఏటీఎం లేదా డెబిట్ కార్డులు తీసుకుంటున్నారు. డబ్బులు తీసుకునేందుకు బ్యాంకులకు రావాల్సిన అవసరం లేకుండా తమకు కావాల్సినప్పుడు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవడానికే అందరూ మొగ్గు చూపుతున్నారు. కానీ రోజు రోజుకు ఈ కార్డుల సంఖ్య పెరుగుతుంటే, ఏటీఎంల సంఖ్య తగ్గడం గమనార్హం. కొన్ని సమయాల్లో ఏటీఎంలలో డబ్బులు లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దానికి తోడు ఏటీఎంల సంఖ్య తగ్గుతోంది. ఉన్న ఏటీఎంలలో డబ్బు త్వరగా అయిపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
ప్రత్యామ్నాయంపై ఆర్బీఐ దృష్టి
దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు కూడా తీసుకుంటోంది. నగదుతో కూడిన మరిన్ని లాకబుల్ క్యాసెట్లను ఏర్పాటు చేయాలని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లను ఇప్పటికే కోరింది. ఏటీఎంలలో ఆపరేటింగ్ సిస్టంను ఎప్పటికి అప్పుడు అప్ గ్రేడ్ చేయాలని కూడా ఆదేశించింది. లాకబుల్ క్యాసెట్స్ కోసం రూ.3,200 కోట్ల నుంచి రూ.4,800 కోట్ల వరకు ఖర్చు అవుతుందని భావిస్తున్నారు. ఏటీఎంలు పెరగకపోయినప్పటికీ ఏటీఎంలలో వేగవంతంగా పని చేయడం, నగదు భర్తీని ఎప్పటికప్పుడు చేయడం అవసరం.
ఏటీఎంలు పెరగాల్సి ఉంది
గత ఏడాది కాలంగా ఏటీఎంల సంఖ్య పెరగడం లేదని ఎఫ్ఐఎస్ ఏటీఎం అండ్ అలైడ్ సర్వీసెస్ డైరెక్టర్ రాధా రామా దొరై అన్నారు. ఇది మంచి పరిణామం కాదని తెలిపారు. ముఖ్యంగా ఓ వైపు ఏటీఎం కార్డుల జారీ పెరుగుతున్నాయని, అలాగే, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ (నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ప్రభుత్వ నిధి వెళ్లడం) పెరుగుతోందని, ఇలాంటి సమయంలో ఏటీఎంలు పెరగాలన్నారు. ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలకు సంబంధించిన డబ్బును లబ్ధిదారులు ఏటీఎం ద్వారా తీసుకుంటున్నారని తెలిపారు. ఇదిలా ఉండగా, పేటీఎం, ఫోన్పే, భీమ్ యాప్ వంటి ఉపయోగం క్రమంగా పెరుగుతోంది. ఇది ఏటీఎంలపై బర్డెన్ తగ్గిస్తోంది.