వీడియో ఎఫెక్ట్: ఇక, జొమాటోలో మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ మరింత భద్రం
న్యూఢిల్లీ: గత ఏడాది డిసెంబర్ నెలలో జొమాటో డెలివరీ బాయ్ ఫుడ్ ప్యాక్ను ఓపెన్ చేసి దానిని కొంత తినేసి, డెలివరీ చేసిన వీడియో వైరల్గా మారిన విషయం తెలిసిందే. దీనిపై కంపెనీ వెంటనే స్పందించింది. తాము టెంపర్ ప్రూఫ్ ప్యాకేజింగ్ను త్వరలో లాంచ్ చేస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం జొమాటో దీనిని లాంచ్ చేసింది.
మీ స్విగ్గీ ఆర్డర్ కూడా క్రెడిట్ స్కోర్ను మార్చేయగలదు?
జొమాటో కో-ఫౌండర్, సీఈవోలు దీపిందర్ గోయల్, మోహిత్ గుప్తాలు సీల్డ్ ప్యాకేజీలను (టెంపర్ ప్రూఫ్ ప్యాకేజింగ్) ప్రారంభించారు. ఈ మేరకు స్మాల్, లార్జ్ సైజ్ ప్యాకేజీలను వారు ప్రారంభించారు. పెద్ద ప్యాక్లో రెండు నుంచి మూడు బాక్సులు, చిన్న ప్యాక్లలో ఒకటి లేదా రెండు ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఆ ప్యాక్ను సంపూర్ణంగా ఉపయోగించేలా డిజైన్ చేశారు.
దీంతో రెస్టారెంట్లు పంపించిన ఆహార పదార్థాలను మార్గమధ్యలో ఎవరూ ఓపెన్ చేసేందుకు వీలులేకుండా గట్టి భదతా చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగానే ట్యాంపర్ ప్రూఫ్ ప్యాకేజింగ్ టేప్స్తో ఫుడ్ డెలివరీ చేస్తున్నట్లు తెలిపింది.
తొలుత దేశంలోని పది నగరాల్లో ఈ తరహా సేవలను ప్రారంభించినట్లు జొమాటో బుధవారం ప్రకటించింది. పునర్వినియోగానికి వీలైన సింగిల్ మెటీరియల్ పాలిమర్తో ఫుడ్ డెలివరీ జరుగుతుందని తెలిపింది. తొలి దశలో ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, పూణె, జైపూర్, చండీగఢ్, నాగ్పూర్, వడోదరల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు సంస్థ మోహిత్ గుప్తా తెలిపారు. ఈ దశలో 5,000 రెస్టారెంట్లు ట్యాంపర్ ప్రూఫ్ ప్యాకేజింగ్తో ఆహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు.
ఇందులో భాగంగా ఫుడ్ డెలివరీ సేవల కోసం ఓ అదనపు లేయర్ను ప్యాకింగ్లో వినియోగిస్తామని జొమాటో తెలిపింది. వస్తు ఉత్పత్తులను ఎవరూ చూడకుండా, అలాగే డ్యామేజీల నుంచీ కాపాడుకునేలా పటిష్టమైన ప్యాకేజీ ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం పది నగరాల్లో అందిస్తున్న ఈ సేవలను క్రమంగా తాము సేవలు అందిస్తున్న 180 నగరాలకు విస్తరిస్తామని తెలిపింది. ఏప్రిల్ నుంచి మరో 25 నగరాల్లో ఈ సేవలు అందిస్తామని తెలిపింది. వినియోగదారులకు తాజా రుచిని, ఆరోగ్యాన్ని అందించడంలో రాజీపడే ప్రసక్తే లేదని పేర్కొంది. దేశవ్యాప్తంగా 5 వేలకు పైగా రెస్టారెంట్లు, హోటళ్లతో జొమాటో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది.