ఏడు రోజుల లాభాలకు బ్రేక్ పడింది ! స్వల్ప నష్టాల్లో ముగిసిన నిఫ్టీ
స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు నీరసించాయి. ఏడు రోజుల వరుస లాభాలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. బ్యాంకింగ్ స్టాక్స్ మద్దతు కొద్దోగొప్పో సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. లేకపోతే మార్కెట్లు మరింత పతనమయ్యేవి. నిఫ్టీ, సెన్సెక్స్లు ఫ్లాట్గా ముగిసినా బ్యాంక్ నిఫ్టీ మాత్రం రికార్డ్ రన్ కొనసాగిస్తోంది. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు కూడా దిగాలు పడ్డాయి. చివరకు 11 పాయింట్ల నష్టంతో 11,521 పాయింట్ల దగ్గర నిఫ్టీ ముగిసింది. సెన్సెక్స్ 23 పాయింట్లు పెరిగి 38,386 దగ్గర క్లోజైంది.
ఉత్సాహంగా ప్రారంభమై, అంతే ఉత్సాహంతో ముగిసిన మార్కెట్
బ్యాంక్ నిఫ్టీ రికార్డ్ రన్
బ్యాంక్ నిఫ్టీలో జోరు ఏ కోశానా తగ్గడం లేదు. రెట్టించిన ఉత్సాహంతో బ్యాంక్ నిఫ్టీ ఎగిరెగిరిపడ్తోంది. ఇంట్రాడేలో ఈ ఇండెక్స్ 29885 పాయింట్ల ఆల్ టైం హై మార్కును తాకింది. చివరకు 65 పాయింట్లు లాభపడి 29832 దగ్గర పటిష్టంగా ముగిసింది. ఈ రోజు పీఎస్యూ బ్యాంక్ స్టాక్స్ కూడా భారీ లాభాలను నమోదు చేశాయి. యూనియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్, పంజాబ్ సింధ్ బ్యాంక్ వంటివి 2 నుంచి 4 శాతం వరకూ పెరిగాయి.
జెట్ గింగిరాలు.. ఇండిగోకు రెక్కలు
జెట్ ఎయిర్ నుంచి వైదొలిగేందుకు ఏతిహాద్ ఎయిర్ లైన్స్ సిద్ధమవుతోంది. కొత్త ఇన్వెస్టర్ కోసం వేట ప్రారంభించిన ఏతిహాద్ కూడా పక్కకు తప్పుకుంటే జెట్ పరిస్థితి అగమ్యగోచరమనేది మార్కెట్ భయం. అందుకే స్టాక్ ఈ రోజు 5 శాతానికి పైగా నష్టపోయి రూ.218 దగ్గర క్లోజైంది. అదే సమయంలో వీళ్ల పతనం ఇండిగో, స్పైస్ జెట్కు కలిసిరాబోతోంది. అందుకే ఇండిగో ఎయిర్ 8 శాతం, స్పైస్ జెట్ 16 శాతం లాభపడి దూసుకుపోతున్నాయి.
వొడా-ఐడియా పడి.. తేరుకుంది
వొడాఫోన్ - ఐడియా షేర్ ఇంట్రాడేలో ఏకంగా 15 శాతం వరకూ పడిపోయింది. రైట్స్ ఇష్యూ ద్వారా రూ.25 వేల కోట్లు సమీకరించడంలో భాగంగా సంస్థ రేషియో ప్రకటించింది. కొత్తగా 2000 కోట్ల అదనపు ఈక్విటీ పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న ధరతో పోలిస్తే 60 శాతం తక్కువకు రైట్స్ ఇష్యూ ద్వారా షేర్లను ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. ఈ వార్తలతో స్టాక్ కుప్పకూలింది. అయితే ఇందులో వొడాఫోన్, ఆదిత్య బిర్లా ప్రమోటర్లు రూ.17 వేల కోట్ల వరకూ కొనేందుకు సంసిద్ధత చూపడం కలిసొచ్చింది. చివరకు నష్టాలను రికవర్ చేసి 4 శాతం లాభాలతో రూ.33.30 దగ్గర స్టాక్ క్లోజైంది.
ఆటో స్టాక్స్ రోడ్డు దిగాయ్
ఆటో స్టాక్స్లో మెల్లిగా సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువవుతోంది. ఫోర్ వీలర్ సహా టూ వీలర్ కంపెనీలు కూడా డిమాండ్ నీరసించడం వల్ల ప్రొడక్షన్ను తగ్గిస్తున్నాయి. ఈ వార్తలతో ఆటో సహా ఆటో యాన్సిలరీ స్టాక్స్ కూడా పతనం దిశగా అడుగులు వేస్తున్నాయి. ఐషర్ మోటార్స్ 4.5 శాతం, టీవీఎస్ మోటార్స్ 3.5 శాతం, మారుతి సుజుకి 3.5 శాతం నష్టపోయాయి. మదర్సన్సుమి, భారత్ ఫోర్జ్, హీరో మోటర్, బజాజ్ ఆటో స్టాక్స్ రెండున్నర శాతం వరకూ కోల్పోయాయి.
జూబిలెంట్ బ్లాక్ డీల్.. 10 శాతం డౌన్
జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ స్టాక్లో బ్లాక్ డీల్ జరిగింది. తమ సంస్థకే చెందిన ఎంప్లాయీ వెల్ఫేర్ ట్రస్కు ఉన్న 2.2 శాతం వాటాను విక్రయించింది. మార్కెట్ ధరతో పోలిస్తే 8.5 శాతం తక్కువగా ప్రైస్ కోట్ చేశారు సిటీ గ్లోబల్ మార్కెట్ బ్రోకర్స్. కంపెనీ సూచించిన విధంగా బ్రోకర్లు రూ.770 చొప్పున 35 లక్షల షేర్ల వరకూ అమ్మారు. దీంతో రెగ్యులర్ మార్కెట్లోనూ స్టాక్ పది శాతం వరకూ పతనమైంది. చివరకు 8 శాతం నష్టంతో రూ.774 దగ్గర క్లోజైంది.
రేపు మార్కెట్ హాలిడే
గురువారం హోలీ సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. మళ్లీ శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభమవుతుంది.