కార్పొరేట్ కొట్లాటలో కూతురికి రూ.360 కోట్ల పరిహారం
ఏ బంధమైనా డబ్బు తర్వాతే అని మరోసారి రుజువైంది. లేటెస్ట్ కార్పొరేట్ వార్లో తండ్రీ - కూతురు మధ్య గొడవ చివరకు రూ.360 కోట్ల డబ్బుతో పరిష్కారమైంది. దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం నిరంజన్ హీరానందానీకి అతని కూతురు ప్రియా మధ్య పదేళ్లుగా జరుగుతున్న గొడవలు ఎట్టకేలకు ముగిశాయి.
దేశంలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒకటైన సంస్థ హీరానందానీ. ఆ సంస్థ ప్రమోటర్ నిరంజన్ హీరానందానీకి.. లండన్లో ఉంటున్న అతని కూతురు ప్రియా వండ్రేవాలాకు మధ్య జరిగిన ఓ గొడవకు భారీ డీల్తో శాశ్వత పరిష్కారం లభించింది.
కుప్పకూలిన జెట్ ఎయిర్వేస్ షేర్లు, అంధకారంలో 23వేల మంది ఉద్యోగుల భవితవ్యం
ఏమిటీ గొడవ
2006లో నిరంజన్కు అతని పిల్లలైన దర్శన్, ప్రియాకు మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఈ బిజినెస్ డీల్ ప్రకారం ఈ గ్రూపు రియాల్టీ ప్రాజెక్టులను అభివృద్ధి చేసి నిర్వహించాలి. అయితే ఈ డీల్ తర్వాత ప్రియా లండన్ వెళ్లిపోయారు. ఈ మధ్యలో మూడేళ్లపాటు అనేక ప్రాజెక్టులను హీరానందానీ గ్రూప్ నిర్వహించింది. దీనిపై తనకు సమాచారం లేదని, తండ్రి - అన్న ఇద్దరూ కలిసి 19 ప్రాజెక్టులను నిర్వహించి డీల్కు వ్యతిరేకంగా నడుచుకున్నారని ఆమె లండన్లోని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్టును సంప్రదించారు. దీనిపై విచారించిన కోర్ట్ 2016లో ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. తండ్రి, అన్న ఇద్దరూ కలిసి రూ.510 కోట్లు ఆమెకు చెల్లించాలని ఆదేశించింది. ఇందులో రూ.360 కోట్లు ప్రియాకు మరో రూ.149 కోట్లు ట్యాక్స్ సహా ఆర్బిట్రేషన్ ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశించింది. ఐదు ప్రాజెక్టుల్లో తండ్రి, అన్నా ప్రియాను మోసగించినట్టు నిగ్గుతేల్చింది.
ఆర్బిట్రేషన్ తీర్పుపై కోర్టుకు..
ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్టుఇచ్చిన తీర్పుపై బాంబే హై కోర్టును సంప్రదించారు నిరంజన్ హీరానందానీ. రూ.149 కోట్ల అదనపు పన్నులు, ఖర్చులను ఇవ్వడానికి వ్యతిరేకించడంతోపాటు ఆమె వీళ్లు ఇచ్చిన నిధులను ఇండియా బయటకు తీసుకెళ్లకూడదని కోర్టుకెక్కారు. దీనిపై ఇరువైపుల నుంచి సుదీర్ఘ వాదనలను విన్న కోర్టు మొదట రూ.360 కోట్లను బ్యాంకులో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. మిగిలిన రూ.149 కోట్లకు బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలని సూచించింది. దీంతో 2017లో నిరంజన్ అతని కొడుకు ఆ సొమ్మును బ్యాంక్ ఖాతాలో జమ చేశారు.
చివరకు..
రెండేళ్లుగా సుదీర్ఘ వాదనలు విన్న బాంబే హై కోర్ట్ జస్టిస్ ఎస్ సి గుప్తే తుది తీర్పును వెల్లడించారు. 180 రోజుల్లోగా ప్రియా వండ్రేవాలాకు రూ.360 కోట్లను చెల్లించాలని ఆదేశించారు. ట్యాక్స్ ప్రొసీడింగ్స్ ఏవైనా ఉంటే హీరానందానీలకు సహకరించాలని ప్రియాకు సూచించారు. ఒక వేళ ట్యాక్స్ రీఫండ్ ఏదైనా వస్తే అది ప్రియాకు మాత్రమే చెందుతుందనే విషయాన్ని కూడా కోర్ట్ స్పష్టం చేసింది.
ప్రియాకు అందబోతున్న రూ.360 కోట్ల పే ఔట్ డబ్బులో రూ.42.4 కోట్లు లిటిగేషన్కు, రూ.31.84 కోట్లు ఆర్బిట్రేషన్ నిమిత్తం ఖర్చవబోతోంది. ఇవన్నీ పోగా ప్రియా వండ్రేవాలాకు అన్న, తండ్రి నుంచి రూ.285.76 కోట్ల డబ్బు అందబోతోంది. అదీ చివరకు కార్పొరేట్ వార్ క్లోజింగ్ డీల్ ఎఫెక్ట్.