ఫౌండేషన్కు ఇప్పుడు రూ.1.45 లక్షల కోట్ల దానం ! అజిం ప్రేమ్జీ ప్రకటన
విప్రో ఛైర్మన్ అజిం ప్రేమ్జీ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. సేవా కార్యక్రమాల విస్తృతిని మరింత పెంచేందుకు మరో 34 శాతం కంపెనీ షేర్లనుఅదనంగా కేటాయించారు. దీంతో ప్రేమ్జీ ఎండోమెంట్ కార్పస్ విలువ ఇప్పుడు ఏకంగా 21 బిలియన్ డాలర్లకు చేరింది. మన కరెన్సీలో ఇది సుమారు రూ.1.45 లక్షల కోట్లు. విప్రో సంస్థలో ఇది మొత్తం 67 శాతం వాటా.
తన వ్యక్తిగత ఆస్తులతో పాటు విప్రోలో తనకున్న షేర్లను ఫౌండేషన్కు బదలాయిస్తున్నట్టు అజిం ప్రేమ్జీ ఈ రోజు ప్రకటించారు. తాజాగా ఆయన చేసిన 34 శాతం అధిక కేటాయింపుల విలువ సుమారు రూ.52750 కోట్లు ఉంటుంది. విప్రోలో తనకు ఉన్న 34 శాతం వాటాను కూడా ఫౌండేషన్ కార్యక్రమాలకు బదలాయించబోతున్నారు.
అందరికీ సమాన అవకాశాలు, స్థిరమైన సమాజ నిర్మాణమే ఉద్దేశంగా ప్రేమ్జీ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందుకోసం ప్రధానంగా అనేక నాన్ప్రాఫిట్ విద్యా సంస్థలను వీళ్లు ప్రోత్సహిస్తున్నారు. కొన్నింటికి మల్టీ ఇయర్ పైనాన్షియల్ గ్రాంట్స్ ఇస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన, క్వాలిటీ ఎడ్యుకేషన్ను ఇవ్వడం కూడా ఇందులో భాగం. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి అజిం ప్రేమ్జీ ఫౌండేషన్ ఈ కార్యక్రమాలనుచేపడ్తోంది.