భారత్ చమురు సంస్థల్లో పెట్టుబడులకు ఆసక్తి కనబర్చిన సౌదీ అరామ్కో సంస్థ
ఢిల్లీ: సౌదీ అరామ్కో... ప్రపంచంలోనే అత్యధిక లాభాలు పొందుతున్న సౌదీ కంపెనీ. ఈ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్తో చర్చలు జరుపుతోంది. చమురు రిఫైనరీలో రిలయన్స్ కంపెనీ సత్తా చాటుతున్న నేపథ్యంలో సౌదీ అరామ్కో ఇందులో వాటా కోసం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే రిలయన్స్ కంపెనీతో చర్చలు ప్రారంభించినట్లు సమాచారం. రిలయన్స్ రిఫైనరీలతో పాటు పెట్రో కెమికల్ సంస్థల్లో కూడా పెట్టుబడులు పెట్టే దిశగా చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు సౌదీ అరామ్కో సీఈఓ అమిన్ అల్ నాసర్.
సౌదీ రాజు మొహ్మద్ బిన్ సల్మాన్తో పాటు భారత పర్యటనకు వచ్చిన సౌదీ అరామ్కో ప్రతినిధులు ముడిచమురు ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే ముందుందని కొనియాడారు. అంతేకాదు 44 బిలియన్ అమెరికా డాలర్లు ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అయితే ప్రతిపాదిత పెట్టుబడులపై స్పష్టమైన సమాచారం వెల్లడించలేదు సౌదీ అరామ్కో సంస్థ. అయితే భారత్లో తమ పెట్టుబడులు ఒక్క ప్రాజెక్టుకే పరిమితం కావని... మరికొన్ని ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సౌదీ అరేబియా మంత్రి ఖలీద్ అల్ ఫలీ తెలిపారు.
ఆసియాలో ముడిచమురు మార్కెట్లో తన మార్కును చూపించాలన్న తపన సౌదీ అరేబియాలో కనిపిస్తోంది. ఇందులో భాగంగానే భారత్లోని ముడిచమురు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తోంది. అరామ్కోకు 2 ట్రిలియన్ మార్కెట్ ఉంది. ఈ క్రమంలోనే పెట్రో కెమికల్ సంస్థల్లో బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చింది. మరోవైపు దక్షిణ కొరియా పెట్రో కెమికల్ ప్రాజెక్టుల్లో ఈ సౌదీ కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టింది. మలేషియా పెట్రోనాస్లో 7 బిలియన్ అమెరికా డాలర్లు పెట్టుబడులు పెట్టింది. భారత్లో కూడా ఇదే తరహా ప్రణాళిక అరామ్కోకు ఉందని ఆ కంపెనీ సీఈఓ వెల్లడించారు. పెట్టుబడుల విషయంలో భారత్కు సౌదీ అరేబియా తొలి ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి చెప్పారు. అయితే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.