పాంచ్ పటాకా.. ! ఐదో రోజూ నష్టాల్లో క్లోజైన మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో నష్టాల్లో ముగిసి ఇన్వెస్టర్ల సహనాన్ని పరిశీలిస్తున్నాయి.అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చి నిరునత్సాహక సంకేతాలతో నీరసంగా మొదలైన మార్కెట్లు ఆ తర్వాత కూడా కోలుకోలేదు.
స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో నష్టాల్లో ముగిసి ఇన్వెస్టర్ల సహనాన్ని పరిశీలిస్తున్నాయి.అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చి నిరునత్సాహక సంకేతాలతో నీరసంగా మొదలైన మార్కెట్లు ఆ తర్వాత కూడా పెద్దగా కోలుకోలేదు. 10786 పాయింట్ల దగ్గర ఫ్లాట్గా మొదలైనప్పటికీ ఆ తర్వాత సెల్లింగ్ ప్రెషర్ కొద్దిగా పెరిగింది. ఒక దశలో 10719 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. ఫిన్ సర్వ్, ఐటి, మెటల్ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి అధికమైంది. చివరకు 48 పాయింట్ల నష్టంతో 10746 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం యెస్ బ్యాంక్ అనూహ్య లాభాలతో పాజిటివ్గా క్లోజ్ అయింది. సెన్సెక్స్ 158 పాయింట్లు కోల్పోయింది.
మిడ్, స్మాల్ క్యాప్ తేరుకున్నాయ్
వరుస నష్టాలతో కుంగిపోతున్న మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు ఈ రోజు ట్రేడింగ్లో కొద్దిగా కోలుకున్నాయి. స్మాల్ క్యాప్ 1.19 శాతం, మిడ్ క్యాప్ 0.61 శాతం లాభపడ్డాయి. ఇతర సెక్టోరల్ ఇండిసెస్ చూస్తే.. మీడియా, ఆటో, ఫార్మా, ప్రైవేట్ బ్యాంక్ రంగ షేర్లకు మంచి కొనుగోళ్ల మద్దతు నమోదైంది.
యెస్ బ్యాంక్ వండర్
2017-18 ఆర్థిక సంవత్సరంలో యెస్ బ్యాంక్.. ఎన్పీఏల క్లాసిఫికేషన్, ప్రొవిజన్స్ విషయంలో అవకతవకలకు పాల్పడిందని అప్పట్లో రిజర్వ్ బ్యాంక్ కూడా భావించింది. సుమారు ఈ వ్యవహారంలో రూ.4000 కోట్లు లావాదేవీలు అక్రమమని భావించారు. అయితే తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్లో అలాంటిదేమీ లేదని తేలింది. అన్నీ పక్కాగా ఉన్నాయని వెల్లడించింది. దీంతో యెస్ బ్యాంక్ షేర్ ఈ రోజు రాకెట్లా దూసుకుపోయింది. 31 శాతం లాభపడింది. ఉదయం నంచి ఆఖరి వరకూ అదే ఉత్సాహాన్ని కొనసాగించింది. చివరకు రూ. 221 దగ్గర క్లోజైంది.
మరిన్ని స్మాల్ క్యాప్ షేకర్స్
నిన్న భారీగా పతనమైన సిజి పవర్ సహా దివాన్ హౌసింగ్, ఐబి వెంచర్స్, అశోక్ లేల్యాండ్, జైన్ ఇరిగేషన్ వంటి స్టాక్స్ ఈ రోజు భారీ లాభాలను నమోదు చేశాయి. దివాన్ హౌసింగ్ ఏకంగా 16 శాతం లాభపడింది. మిగిలిన స్టాక్స్ 5 శాతానికి తక్కువ లేకుండా ఎగిరి గంతేశాయి.
ఈ మధ్య బాగా పతనమైన గ్రాఫైట్ ఇండియా, ఐబి వెంచర్స్, ఇండియన్ బ్యాంక్, రిలయన్స్ నిప్పాన్ కూడా దూకుడుమీద ఉన్నాయి.
క్రూడ్ ఎఫెక్ట్
అంతర్జాతీయ మార్కెట్ క్రూడాయిల్ ధరలు వరుసగా మూడో రోజు కూడా లాభపడి 64 డాలర్లకు చేరువ కావడం దేశీయ ఆయిల్ కంపెనీలపై ప్రభావాన్ని చూపుతోంది.ఈ రోజు ట్రేడ్లో ఇండియన్ ఆయిల్, బిపిసిల్ 4 శాతం నష్టపోగా, హెచ్ పి సి ఎల్ 2.2 శాతం వరకూ కోల్పోయింది.