కంపెనీ యాజమాన్య హక్కుల నిబంధనలు కట్టుదిట్టం
కంపెనీ యాజమాన్య హక్కులకు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తే కనుక తీవ్రమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఎవరైనా కావాలని తప్పుడు సమాచారం ఇస్తే వారి ఆట కట్టించేందుకు కంపెనీల చట్టంలోని నిబంధనల్ని ప్రభుత్వం సవరించింది.
బినామీ లావాదేవీలు, అక్రమంగా నిధుల మళ్లింపు వంటి వాటిని గుర్తించేందుకు సవరించిన నిబంధనలు తోడ్పడనున్నాయి. సవరించిన నిబంధనల ప్రకారం భారత కార్పొరేట్ కంపెనీలతో పాటు సంస్థల్లో యాజమాన్య హక్కుల ద్వారా అత్యధికంగా లబ్ధి పొందుతున్న వారు పూర్తి సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది.
కంపెనీల్లో యాజమాన్య హక్కులకు సంబంధించి సరైన వివరాలను అందజేయకపోవటం, తప్పుడు సమాచారాన్ని అందించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవటంతో పాటు సదరు సంస్థలపై చర్యలు తీసుకునే విధంగా కంపెనీల చట్టం 2013లో నిబంధనలను ప్రభుత్వం సవరించింది.
కంపెనీల చట్టం 2013లోని నిబంధనల ప్రకారం యజమానులు ఎవరైనా తమ హక్కులకు సంబంధించిన సమాచార డిక్లరేషన్ను సమర్పించే విధంగా కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిబంధనల్ని సవరించింది. ఇండివిడ్యువల్, యాజమాన్య హక్కుల ద్వారా గరిష్ఠంగా లాభం పొందుతున్నవారు, కార్పొరేట్లు.. పూర్తి వివరాలతో అవసరమైన సమచారాన్ని మం త్రిత్వ శాఖకు అందించాల్సి ఉంటుంది.
యాజమాన్య హక్కులకు సంబంధించి డిక్లరేషన్ను సమర్పించటంలో విఫలమైనవారు.. చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా జరిమానా, జైలు శిక్ష లేదా రెండింటిని ఎదుర్కొవాల్సి ఉంటుందని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.