ఆర్బీఐ వద్ద ఉన్న రూ.27,380 కోట్లు తమకు బదలాయించాలని కోరిన కేంద్రం
న్యూఢిల్లీ: ఏవైనా అనుకోని ఆర్థిక ఇబ్బందులు వంటివి తలెత్తితే వినియోగించేందుకు ఆర్బీఐ వద్ద ఉన్న రూ.27,380 కోట్లు తమకు బదలాయించాలని కేంద్ర ప్రభుత్వం.. ఆర్బీఐని కోరింది. 2016-17 సంవత్సరానికి రూ.13,190 కోట్లను, 2017-18లో రూ.14,190 కోట్లను ఆర్బీఐ రిస్క్ అండ్ రిజర్వ్ ఫండ్ కింద పక్కన పెట్టింది.
గత ఏడాది రిజర్వ్లను దృష్టిలో పెట్టుకొని రిజర్వ్ మిగులును కేంద్రానికి బదలాయించాలని ఆర్థిక శాఖ కోరింది. అంతకుముందు ఆర్థిక శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రూ.28వేల కోట్ల మధ్యంతర డివిడెండ్ను ఆశిస్తోందని తెలిపారు.
ఆర్బీఐ ఆర్థిక సంవత్సరం జులై-జూన్ మధ్య ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఇప్పటికే రూ.40వేల కోట్లను ప్రభుత్వానికి బదలీ చేసింది. ఒకవేళ తాజాగా ప్రభుత్వం కోరిన మొత్తాన్ని కూడా ఆర్బీఐ బదలాయిస్తే ఆ మొత్తం రూ.68వేల కోట్లకు చేరుతుంది.