ఆఖరి గంటలో లాభాలు ఆవిరి ! ఆరో రోజూ స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్
స్టాక్ మార్కెట్లో ఐదు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఆర్బీఐ సమీక్ష నేపధ్యంలో తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు చివరకు ఫ్లాట్గా ముగిశాయి.
స్టాక్ మార్కెట్లో ఐదు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఆర్బీఐ సమీక్ష నేపధ్యంలో తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు చివరకు ఫ్లాట్గా ముగిశాయి. ఉదయం నుంచి ఆఖరి సెషన్ వరకూ సుమారు 70-80 పాయింట్ల ఊగిసలాడ నమోదైంది. మధ్యాహ్నం 11.45 నిమిషాలకు ఆర్బీఐ వడ్డీరేట్లపై కోత విధించినప్పుడు నిఫ్టీ 11,140 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ప్రకటన వచ్చిన వెంటనే నష్టాల్లోకి జారుకున్న నిఫ్టీ ఒక దశలో 11042 పాయింట్ల కనిష్ట స్థాయి వరకూ వెళ్లింది.
మళ్లీ అక్కడి నుంచి అదే స్థాయిలో వి షేర్ లాంటి రికవరీ నమోదైంది. నిఫ్టీ 11,112 పాయింట్ల వరకూ వెళ్లింది. ఆఖర్లో లాభాల స్వీకరణ రావడంతో 50 పాయింట్ల వరకూ కోల్పోయి 11069 దగ్గర క్లోజైంది. చివరకు 7 పాయింట్ల లాభంతో సరిపెట్టుకుంది.
అటువైపు సెన్సెక్స్ 4 పాయింట్ల నష్టంతో 36971 దగ్గర, బ్యాంక్ నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో 27387 దగ్గర క్లోజయ్యాయి. మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఈ రోజు అర శాతానికి పైగా లాభపడడం కలిసొచ్చే అంశం.
ఏ స్టాక్స్లో ఎలాంటి ట్రేడ్
బ్యాంకింగ్, ఫిన్ సర్వ్, పీఎస్యూ బ్యాంక్స్, రియాల్టీ రంగ కౌంటర్లలో కొద్దిగా అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. మీడియా, ఆటో, ఫార్మా, ఎఫ్ఎంసిజి కౌంటర్లు మాత్రం లాభాల బాటలో పరుగులు తీశాయి. జీ ఎంటర్ టైన్మెంట్, సన్ ఫార్మా, ఐషర్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. జెఎస్డబ్ల్యు స్టీల్, రిలయన్స్, ఎల్ అండ్ టి నష్టాల్లో క్లోజయ్యాయి.
రేమండ్స్ లో నష్టాలు
మిడ్ సెషన్ తర్వాత రేమండ్స్ స్టాక్లో అనూహ్యమైన సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. వాల్యూమ్స్తో సహా స్టాక్ పది శాతం వరకూ పడింది. ప్రమోటర్ గౌతం సింఘానియా వ్యక్తిగత సంస్థకు రేమండ్స్కు మధ్య నాలుగేళ్లుగా జరుగుతున్న అనుమానాస్పద లావాదేవీలపై బ్లూంబర్గ్ క్వింట్ ఇన్వెస్టిగేటివ్ స్టోరీ ప్రచురించింది. ఈ వార్తల నేపధ్యంలో స్టాక్ భారీగా పడి చివరకు 8 శాతం నష్టంతో రూ.655 దగ్గర క్లోజైంది.
గ్రాసిం రిజల్ట్స్
గ్రాసిం ఇండస్ట్రీస్ మెరుగైన త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. రెవెన్యూలో 21 శాతం (రూ.5292 కోట్లు), నికర లాభంలో 28 శాతం (రూ.608 కోట్లు) వృద్ధిని నమోదు చేసింది. మార్జిన్లలో స్వల్ప క్షీణత ఉన్నప్పటికీ స్టాక్ మాత్రం లాభాల్లోనే ముగిసింది. చివరకు 3 శాతం పెరిగి రూ.753 దగ్గర క్లోజైంది.
రూ. 60వేల దిగువకు ఎంఆర్ఎఫ్
ఎంఆర్ఎఫ్ నిరుత్సాహక క్వార్టర్లీ రిజల్ట్స్ పోస్ట్ చేస్తోంది. ఆదాయంలో కేవలం 6.2 శాతం వృద్ది కనబరిస్తే, నికర లాభం 18 శాతం పడిపోయి రూ.279 కోట్లకు చేరింది. ఎబిటా మార్జిన్లు కూడా క్షీణించాయి. రూ.245 కోట్ల ఇన్వెంటరీ రైట్ ఆఫ్ కూడా లాభాల క్షీణతక మరోకారణం. దీంతో ఈ స్టాక్ 1 శాతం వరకూ కోల్పోయి రూ.59637 దగ్గర క్లోజైంది.