వరుసగా నాలుగో రోజూ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్ సూచీలు కేవలం స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. అయితే నాలుగో రోజూ లాభాల్లో ముగియడం కొద్దిగా ఊరటనిస్తోంది.
స్టాక్ మార్కెట్ సూచీలు కేవలం స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. అయితే నాలుగో రోజూ లాభాల్లో ముగియడం కొద్దిగా ఊరటనిస్తోంది. గురువారం విడుదల కాబోయే ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న మార్కెట్లు.. అంత వరకూ ఇలానే నిస్తేజంగా కదలాడే సూచనలున్నాయి. బ్యాంకింగ్, ఆటో, ఫిన్ సర్వ్, మీడియా రంగ కౌంటర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఎఫ్ఎంసిజి, రియాల్టీ, మెటల్ కౌంటర్లలోని స్టాక్స్ మాత్రం దిగాలుపడ్డాయి. చివరకు నిఫ్టీ 22 పాయింట్ల నష్టంతో 10,934 దగ్గర, సెన్సెక్స్ 34 పాయింట్ల లాభంతో 36,617 దగ్గర క్లోజయాయి.
అడాగ్ స్టాక్స్లో రక్త కన్నీరు
అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్ స్టాక్స్ అన్నీ నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్ దివాలా దిశగా అడుగులు వేయడంతో ఆ ప్రభావం గ్రూపులోని మిగతా సంస్థలపై పడింది. ఈ రోజు ట్రేడింగ్లో రిలయన్స్ పవర్ 30 శాతం, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 30 శాతం నష్టపోయాయి. ఈ ట్రెండ్ ఇలానే కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిన్న స్టాక్స్ మరింత చితికాయ్ ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన స్టాక్స్ అన్నీ ఇప్పుడు సింగిల్ డిజిట్ నెంబర్ రేట్లకు వచ్చేస్తున్నాయి.
తాజాగా సుజ్లాన్ కూడా అప్పు కట్టడంలో ఇబ్బందులు పడ్తోందనే వార్తలు సదరు స్టాక్ను 25 శాతం పడేశాయి. ఇంట్రాడేలో రూ.2.70 కనిష్ట స్థాయికి దిగొచ్చిన స్టాక్ చివర్లో కొద్దిగా కోలుకుని రూ.3.59 దగ్గర క్లోజైంది. ఇదే బాటలో సిజి పవర్ 15 శాతం, జై ప్రకాశ్ ఆసోసియేట్స్ 13 శాతం, హెచ్ డి ఐ ఎల్ 13 శాతం, శ్రేయీ ఇన్ఫ్రా 11 శాతం కోల్పోయాయ్.
జూబిలెంట్కు రాయల్టీ దెబ్బ
జూబిలెంట్ ప్రమోటర్ కంపెనీకి జూబిలెంట్ అనే పేరు వాడుకున్నందుకు రాయల్టీ కింద 0.5 శాతం చెల్లించాలని బోర్డు భావిస్తోంది. ఈ వార్తలు బయటకు పొక్కడంతో స్టాక్ను ఏకంగా 11 శాతం పడేశారు. రాయల్టీ సొమ్ము రూ.15 కోట్ల వరకూ రావొచ్చనే లెక్కలు వినిపించాయి. అయితే ఇది చిన్న మొత్తమే అయినా డబ్బును దండుకునేందుకు మేనేజ్మెంట్ వెతుక్కున్న మార్గమే సరికాదనేది ఎనలిస్టుల మాట. అందుకే ఈ స్టాక్ ఇంట్రాడేలో రూ.1205 స్థాయికి పడిపోయింది. చివరకు కొద్దిగా కోలుకున్నా 7 శాతం నష్టంతో రూ.1303 దగ్గర క్లోజైంది.
భెల్, టాటా బెవరేజెస్కు రిజల్ట్ షాక్
నిరుత్సాహక త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన భెల్ స్టాక్ ఈ రోజు 12 శాతం వరకూ పడింది. ఇంట్రాడేలో రూ.56.25 వరకూ వెళ్లిన స్టాక్ చివరకు 9.5 శాతం నష్టాలతో రూ.58.70 దగ్గర క్లోజైంది. ఇదే బాటలో టాటా బెవరేజెస్ కూడా 8 శాతం నష్టపోయి రూ.185 దగ్గర ముగిసింది. ఐఆర్బి ఇన్ఫ్రా కూడా 12 శాతం వరకూ నీరసించింది.
52 వారాల కనిష్టానికి 300 స్టాక్స్
మార్కెట్ లాభాల్ల ముగిసినా 323 స్టాక్స్ ఏడాది కనిష్టానికి దిగొచ్చాయి. ఆ జాబితాలో అక్షర్ కెమ్, అంజనీ పోర్ట్ల్యాండ్, బాల్క్రిష్ణ ఇండస్ట్రీస్, బీఏఎస్ఎఫ్ ఇండియా, కోల్ ఇండియా, దిలీప్ బిల్డ్కాన్, ఫియం ఇండస్ట్రీస్, ఫినోలెక్స్ కేబుల్స్, జీఎం బ్రూవరీస్, గోద్రెజ్ ఆగ్రోవెట్, హరిత సీటింగ్, ఐఎఫ్బి ఆగ్రో, ఇండియా సిమెంట్స్, జయభారత్ మారుతి, మహీంద్రా లైఫ్, ఎంఆర్ఎఫ్, నోసిల్, రెయిన్ ఇండస్ట్రీస్, రిలయన్స్ క్యాపిటల్, శంకర బిల్డ్కాన్, శ్రీపుష్కర్ కెమికల్స్, వీఎస్టి టిల్లర్ స్టాక్స్ ఉన్నాయి.