మరుసటి రోజే ట్విస్ట్: చందాకొచ్చార్పై కేసు నమోదు చేసిన సీబీఐ అధికారి బదలీ
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకు మాజీ ఉద్యోగి చందా కొచ్చార్, ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) అధికారి బదలీ అయ్యారు. చందా కొచ్చార్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ అధినేత వేణుగోపాల్ ధూత్ పైన సీబీఐ కేసు నమోదు చేసిన మరుసటి రోజే ఇది జరగడం గమనార్హం.
సీబీఐలో బ్యాంకింగ్, సెక్యూరిటీస్ ఫ్రాడ్ సెల్లో ఎస్పీ హోదా సుధాంషు ధర్ మిష్రా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈయన తాజాగా ఝార్ఖండ్లోని రాంచీ శాఖకు బదిలీ అయ్యారు. ఐసీఐసీఐ, వీడియోకాన్ కేసులో చందా కొచ్చార్, దీపక్ కొచ్చర్, వేణుగోపాల్ ధూత్తోపాటు ఇతరులపై ఈ నెల 22న నమోదు చేసిన ఎఫ్ఐఆర్పై ఇతను సంతకం చేశారు.
మరుసటి రోజే అతనిని బదలీ చేస్తున్నట్లు సీబీఐ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో 24న చందా కొచ్చార్ తదితరులపై సీబీఐ కేసు నమోదు చేసింది. చందా కొచ్చార్ అధ్యక్షతన గల కమిటీ వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్కు 2009లో రూ.300 కోట్లు, 2011లో రూ.750 కోట్లు రుణంగా మంజూరు చేసిందని, ఈ విషయంలో నిబంధనలు పాటించలేదని సీబీఐ పేర్కొంది.
ఇచ్చిన రుణాల్లో చాలా వరకు తిరిగి వసూలుకాకపోవడంతో బ్యాంకుకు రూ.1,730 కోట్లు నష్టం వచ్చినట్లు ఆరోపించింది. రుణాలు మంజూరుకు ప్రతిఫలంగా వీడియోకాన్ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ ధూత్.. సూపర్ ఎనర్జీ పేరుతో చందా కొచ్చార్ భర్త దీపక్ కొచ్చార్కు చెందిన కంపెనీలో రూ.64 కోట్లు పెట్టుబడి పెట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ పెట్టుబడి అవినీతి కిందికే వస్తుందని ఆరోపిస్తూ కేసు నమోదు చేసింది.