ఈసారి దీపావళి కాంతులు లాభాల లేదా నష్టాల?మీరే చూడండి.
మన దేశంలో ఉన్న పండుగలలో దీపావళి ఒక పెద్ద పండుగ ఇక ఈ పండగ వచ్చింది అంటే చాలు చిన్న పెద్ద అంతా కలిసి చాలా సంతోషంగా జరుపుకుంటారు. ఇక ఈ పండగకి వ్యాపారులకు చాలా లాభం తీసుకోని వస్తుంది. మరి ఈ దీపావళికి వ్యాపారులకు ఎన్ని లాభాలు తెచ్చిందో లేదా నష్టాలు తెచ్చిందో చూద్దాం.
దీపావళి వస్తుందంటే చాలు షాపులన్ని జనాలతో కళకళలాడటం చూస్తుంటాం. కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మార్కెట్లో చాలా వ్యాపారాలు ఢీలా పడిపోయాయి. కస్టమర్లు లేక మాల్స్, షాప్స్ వెలవెలబోతున్నాయి. పండుగ నేపథ్యంలో భారీ మొత్తంలో విక్రయ సామాగ్రిని తీసుకొచ్చామని.. కానీ కస్టమర్లు లేక కనీసమాత్రం గిరాకీ కూడా లేకుండా పోయిందని వ్యాపారులు వాపోతున్నారు.
నిజానికి నోట్ల రద్దు జరిగిన నాటి నుంచి ఇదే పరిస్థితి నెలకొందనేది కొందరు వ్యాపారుల వాదన. అయితే గతంతో పోలిస్తే ఈసారి పరిస్థితి మరింత దారుణంగా ఉందని వారు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ షాప్స్, బట్టల దుకాణాలు, స్ట్రీట్ షాప్స్, లోకల్ బజార్స్.. ఇలా ఎక్కడ చూసినా జనాల తాకిడి అంతగా కనిపించడం లేదు. దీంతో దీపావళి సీజన్ తమకు లాభాలు తీసుకొస్తుందని భావించిన వ్యాపారులంతా.. కనీసం పెట్టిన పెట్టుబడి అయినా వెనక్కి వస్తే చాలని భావిస్తున్నారు.
అటు బాణసంచా వ్యాపారుల పరిస్థితి కూడా అలాగే ఉంది. సుప్రీం ఆంక్షలతో ఈసారి బిజినెస్ చాలావరకు పడిపోయిందని వారు వాపోతున్నారు. పండుగ రోజుల్లో కేవలం రాత్రి 8 నుంచి 10 గంటల మధ్యే బాణసంచా కాల్చాలన్న నిబంధనలతో అమ్మకాలు తగ్గిపోయాయని అంటున్నారు. మొత్తం మీద దీపావళికి లక్ష్మీ కటాక్షం దక్కుతుందనుకుంటే.. కొనుగోళ్లు లేక వ్యాపారుల గల్లా పెట్టెలు బోసిపోతున్నాయి.
గత ఏడాదితో పోలిస్తే ఈసారి దీపావళికి 40 శాతం బిజినెస్ పడిపోయింది. మార్కెట్లలో ఎక్కడా పండుగ సీజన్లో ఉండే ఫీవర్ కనిపించడం లేదు. అయితే చివరి నిమిషంలో అమ్మకాలు పుంజుకుంటాయేమోనన్న ఆశ మాత్రం లేకపోలేదు. సోమవారం నుంచి అమ్మకాలు ఊపందుకుంటాయని చాలామంది వ్యాపారులు భావిస్తున్నారు.