స్టాక్ మార్కెట్ చరిత్రలోనే మరో భారీ పతనం 1000 పాయింట్లు డౌన్
స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇది మరో దారుణమైన పతనం. పదులు, వందలు కాదు... ఏకంగా వెయ్యి పాయింట్లు నష్టపోయింది సెన్సెక్స్. ఉదయం మార్కెట్ ఆరంభమైన కొద్ది నిమిషాల్లోనే మార్కెట్లు కుప్పకూలాయి. మొదట్లో సెన్సెక్స్ 1000 పాయింట్లు పతనమైనా ఆ తర్వాత 200 పాయింట్లు పుంజుకుంది. 800 పాయింట్ల పతనంతో సెన్సెక్స్ కొనసాగుతోంది. ఇక నిఫ్టీ 300 పాయింట్లు పతనమై 10,200 పాయింట్ల దిగువన ప్రారంభమైంది.
మరోవైపు రూపాయి విలువ 24 పైసలు క్షీణించడంతో ప్రస్తుతం 74.47 కనిష్టాన్ని తాకింది. ఓవైపు రూపాయి పతనం, మరోవైపు అంతర్జాతీయ అంశాలు, ప్రపంచ దేశాల మధ్య వాణిజ్య యుద్ధాలు భారతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలడంతో గురువారం ఉదయం కేవలం 5 నిమిషాల్లోనే రూ.4 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయింది. ఉదయం 10.35 గంటల సమయానికి సెన్సెక్స్ 838.86 పాయింట్లు నష్టపోయి 33922.03 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 261.40 పాయింట్లు నష్టపోయి 10163.55 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 24పైసలు క్షీణించి రూ.74.45 పైసలతో తాజా జీవన కాల గరిష్ఠానికి చేరింది. ప్రస్తుతం 19 పైసలు క్షీణించి 74.40 వద్ద కొనసాగుతోంది.
ఎన్ఎస్ఈలో హెచ్పీసీఎల్, భారతీ ఇన్ఫ్రాటెల్, బీపీసీఎల్, జీ ఎంటర్టెయిన్మెంట్, ఓఎన్జీసీ తదితర షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు టాటాస్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ, హెచ్సీఎల్ టెక్, హిండాల్కో తదితర షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.