బ్లాక్ ఫ్రైడే స్టాక్ మార్కెట్ భారీ పతనం.. ఆర్బిఐ ఊహించని షాక్!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఊహించని షాకిచ్చింది. గతంలోలాగానే ఈసారి కూడా రెపోరేట్లు పెరుగుతాయన్న అంచనాలను పటాపంచలు చేసింది ఆర్బీఐ. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచి ఆశ్చర్యపర్చింది. రెపో రేటు 6.5%, రివర్స్ రెపో రేటు 6.75% అలాగే ఉంది. రెపోరేట్లలో మార్పు లేకపోవడం సామాన్యులకు ఊరటేనని చెప్పుకోవాలి. లేకపోతే ఈఎంఐలపై భారం పడేది.
శుక్రవారం ఉదయం నుంచి ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ ఆధ్వర్యంలో పరపతి విధాన కమిటీ సమావేశం జరిగింది. రెపోరేట్లు పెంచుతుందన్న ప్రచారం జోరుగా జరిగింది. కనీసం 25 బేసిస్ పాయింట్లు రెపో రేటును పెంచుతారని నిపుణులు అంచనా వేశారు. రూపాయి మారకం విలువ 74 దాటడంతో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంటుందనే అనుకున్నారు.
కానీ ఆర్బీఐ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ రెపోరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు దింతో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోయారు. అమ్మకాలు వెల్లువెత్తడంతో నిఫ్టి ఒకదశలో 300 పాయింట్లు, సెన్సెక్స్ 900 పాయింట్లు నష్టపోయాయి. చివర్లో కాస్త కోలుకుని నిఫ్టి 282 పాయింట్లు, సెన్సెక్స్ 792 పాయింట్ల నష్టంతో ముగిశాయి. నిఫ్టి కేవలం 8 షేర్లు మాత్రమే లాభాల్లో ముగిశాయి. ఇన్ఫోసిస్, ఇన్ఫ్రాటెల్, టీసీఎస్, టైటాన్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభపడిన నిఫ్టి షేర్లలో ముందున్నాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో హెచ్పీసీఎల్ 24.5 శాతం, బీపీసీఎల్ 20 శాతం క్షీణించాయి. ఐఓసీ 16 శాతం, ఓఎన్జీసీ 15 శాతం, గెయిల్ 10 శాతంపైగా నష్టపోయాయి.
ఉదయం నుంచే నష్టాల్లో ఉన్న సెన్సెక్స్, నిఫ్టీ ఆర్బీఐ ప్రకటన తర్వాత మరింత కుప్పకూలాయి. దలాల్ స్ట్రీట్లో బ్లాక్ ఫ్రైడేను తలపించింది. సెన్సెక్స్ 2.25 శాతం అంటే 792 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ 2.67 అంటే 282 పాయింట్లు పతనమైంది. ప్రస్తుతం సెన్సెక్స్ 34,376, నిఫ్టీ 10,316 దగ్గర ఆగాయి. ఒక్కరోజులోనే ఇన్వెస్టర్లు రూ.4 లక్షల కోట్లు నష్టపోయారు.