తిరుమలలో బయటపడ్డ మరో కుంభకోణం ఏంటో తెలుసా?
కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో భారీ టిక్కెట్ల కుంభకోణం బయటపడింది. పారదర్శకత కోసం టీటీడీ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కేటుగాళ్లు భక్తులను బురిడీ కొట్టిస్తూనే ఉన్నారు. శ్రీవారిని దర్శించుకోవాలన్న ఆత్రుతలో భక్తులు సైతం సులువుగా వీరి చేతిలో మోసపోతున్నారు.
ఇంతకీ అసలు విషయమేంటంటే.. కొంతమంది కేటుగాళ్లు నకిలీ ఆధార్ ఐడీలతో 2600 సేవా టిక్కెట్లను ఆన్లైన్లో రిజిస్టర్ చేశారు. ఒక్కో టిక్కెట్టుకు భక్తుల నుంచి వేల రూపాయాలు వసూలు చేస్తూ వారిని దోచుకుంటున్నారు. ఇందులో కర్ణాటక మాజీ ఐఏఎస్ కొడుకు హస్తం కూడా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్నాళ్లుగా తిరుమలలో నకిలీ సేవా టిక్కెట్ల దందా జరుగుతోందన్న ఆరోపణలున్నాయి.
ఈ నేపథ్యంలో నకిలీ సేవా టిక్కెట్ల ముఠాను పట్టుకునేందుకు ఓ ప్రత్యేక పోలీసుల బృందం ఇప్పటికే కర్ణాటక వెళ్లింది. త్వరలోనే ఈ ముఠా వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు ఆన్ లైన్ లాటరీ ద్వారా భక్తులు పొందవచ్చు. కానీ కొందరు కేటుగాళ్లు నకిలీ ఆధార్ ఐడీలతో ఆర్జిత సేవా టిక్కెట్లు దక్కించుకుని.. ఎక్కువ ధరలకు భక్తులకు అమ్ముతున్నారు.