ఈ చేవెళ్ల చెల్లమ్మ సూపర్ థాట్ ఈజ్ శైలజ రెడ్డి.
ఎన్నికల సమయంలో నోట్లు వెదజల్లడం గెలిచాక అందినకాడికి దోచుకోవడం సగటు రాజకీయ నాయకుడిపై సామాన్యుడిలో బలంగా నాటుకుపోయిన అభిప్రాయం ఇది. ప్రభుత్వ నిధుల్ని స్వాహా చేసి ప్రశ్నించేవాళ్లపై ఇష్టారీతిన చిందులు తొక్కే నేతలకు కొదువే లేదు. అయితే అందరూ ఇలాగే ఉంటారా?.. ఉండకపోవచ్చునేమో!.. శైలజారెడ్డి అనే ఓ జడ్పీటీసీ చేస్తున్న పని చూస్తే ఈరోజుల్లో ఇలాంటి రాజకీయ నాయకులు కూడా ఉన్నారా? అని ముక్కున వేలేసుకోక మానరు.
ఇంతకీ విషయమేంటంటే ప్రజలకు ఇచ్చిన అభివృద్ది హామిలను నెరవేర్చడానికి చేవెళ్ల టీఆర్ఎస్ జడ్పీటీసీ శైలజారెడ్డి ఏకంగా తన సొంత ప్లాట్నే అమ్మకానికి పెట్టారు. తద్వారా వచ్చిన డబ్బుతో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ నిధుల కోసం వేచి చూసి తీవ్ర నిరాశ చెందిన ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.బీజాపూర్ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న తన ప్లాట్ను విక్రయించి.. తద్వారా వచ్చిన రూ.24లక్షలను మడికట్టు గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులకు వినియోగించారు. మంగళవారం దీనికి భూమి పూజ నిర్వహించారు.
సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మరీ శైలజారెడ్డి అభివృద్ది పనులు చేపడుతుండటంపై ప్రశంసలు కురుస్తున్నాయి. పూర్తిగా జవాబుదారీతనం కరువైన ప్రస్తుత రాజకీయాల్లో.. ఇచ్చిన హామిలకు కట్టుబడి శైలజారెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా హర్షనీయమే!