లగడపాటి రాజగోపాల్ కంపెనీ రద్దు ఎందుకో తెలుసా? మీరే చూడండి.
మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్కు చెందిన ల్యాంకో ఇన్ఫ్రా ట్రేడింగ్ను రద్దు చేయనున్నట్లు బిఎస్ఇ ప్రకటించింది. భారీ అప్పుల ఊబిలో కూరుకుపోయి, మూసివేతకు గురైనా ఈ కంపెనీ షేర్ల ట్రేడింగ్ను సెప్టెంబర్ 14 నుంచి రద్దు చేయాలని స్టాక్ ఎక్సేంజీలు నిర్ణయించాయి.ఈ కంపెనీ వివిధ బ్యాంకులకు రూ.44,000 కోట్ల అప్పులు చెల్లించకపోవడంతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సిఎల్టి) లిక్విడేషన్ ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారానికి పరిష్కార నిపుణుడిగా (ఆర్పి) ఉన్న సావన్ గొడియావాలాను ల్యాంకో ఇన్ఫ్రా లిక్విడేటర్గా నియమించింది లిక్విడేషన్ ప్రక్రియ మొదలైన నేపథ్యంలో భవిష్యత్లో మార్కెట్ సమస్యలను నివారించేందుకు ఈ చర్య తీసుకున్నట్టు బిఎస్ఇ ఒక సర్యులర్లో తెలిపింది.
శుక్రవారం బిఎస్ఇలో ల్యాంకో ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ షేర్ 4 శాతం పతనమై రూ.0.48 వద్ద ముగిసింది. ఆర్బిఐ రూపొందించిన జాబితాలోని బ్యాంకులకు భారీగా అప్పులు ఎగ్గొట్టిన 12 కంపెనీల్లో ల్యాంకో ఒక్కటిగా ఉంది. ల్యాంకోకు భారీగా రుణాలిచ్చిన ప్రధాన బ్యాంకు ఐడిబిఐ కంపెనీ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ హైదరాబాద్ ఎన్సిఎల్టి పిటిషన్ వేసింది. దీన్ని విచారించిన ఎన్సిఎల్టి ఇటీవల లిక్విడేషన్కు ఆదేశాలిచ్చింది. పలు బ్యాంకులకు కనీసం వడ్డీ కూడా చెల్లించే పరిస్థితిలో లేని ల్యాంకో ఇన్ఫ్రా ఆస్తులన్నిటినీ ఆమ్మి అప్పులు తీర్చే ప్రక్రియకు ఆగస్టు 27న అనుమతినిచ్చింది.
1993లో ఏర్పడిన ల్యాంకో 2006 నవంబర్ 6వ తేదీన పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. అప్పటి నుంచి అనేక రంగాల్లోకి విస్తరించిన ల్యాంకో ఆరంభంలో ఇన్వెస్టర్లకు భారీ ఎత్తున లాభాలను తెచ్చి పెట్టింది. చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయకపోవడంతో కంపెనీ బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లించలేకపోయింది. దీంతో బ్యాంకులు దివాళా పిటీషన్ చేశాయి. దివాళాకు ఎన్ సీఎల్ టీ ఆదేశించడంతో కంపెనీ చరమదశకు చేరుకుంది. ప్రస్తుతం కంపెనీ షేర్లు 40 పైసల వద్ద ట్రేడవుతున్నాయి.