కోహ్లీకి ఈ ఐ.పి.యల్ లో భారీ జరిమానా ఎంతో తెలుసా? ఎందుకో తెలుసా?
ఈ ఐపీఎల్ స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీకి కలిసి రావడం లేదు. అతని జట్టు గెలవాల్సిన మ్యాచ్లు కూడా ఓడిపోతోంది. రెండు వందల పరుగుల పైచిలుకు పరుగులు చేసినా ఓటమి చవిచూడాల్సి రావడం దురదృష్టకరమే. తాజాగా చెన్నైతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు 206 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓ దశలో చైన్నై జట్టు 74 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో ధోనీ, రాయుడు చెలరేగి ఆడి బెంగళూరును ఓడించారు.
ఈ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా కోహ్లీపై భారీ జరిమానా పడింది. స్లోఓవర్రేట్ కారణంగా ఆర్సీబీ జట్టు కెప్టెన్ కోహ్లీకి 12 లక్షల రూపాయల జరిమానా విధిస్తున్నాం. ఇలా చేయడం ఈ జట్టుకు ఇదే తొలిసారి అని ఐపీఎల్ మేనేజ్మెంట్ ఓ లేఖ విడుదల చేసింది. కాగా, ఈ ఐపీఎల్లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడిన బెంగళూరు జట్టు కేవలం రెండు మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో నిలిచింది.