జైప్రకాష్ అసోసియేట్స్కు సుప్రీం కోర్ట్ షరతు విధించింది?
న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న రియల్టీ సంస్థ జైప్రకాష్ అసోసియేట్స్ను రెండు విడతల్లో మొత్తం రూ.200 కోట్లు డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది.
న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న రియల్టీ సంస్థ జైప్రకాష్ అసోసియేట్స్ను రెండు విడతల్లో మొత్తం రూ.200 కోట్లు డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది.
ఏప్రిల్ 6లోపు రూ.100 కోట్లు, మే 10లోపు మరో రూ.100 కోట్లను జమ చేయాలని కోరింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ నిర్వహించింది.
రిఫండ్ (తాము చెల్లించిన డబ్బుల్ని వెనక్కి తీసుకోవడం) ఎంచుకున్న కస్టమర్లకు ఈఎంఐ బకాయి ఉంటే నోటీసులు పంపొద్దని ఆదేశించింది. ప్రాజెక్టుల వారీగా రిఫండ్ ఎంచుకున్న వారి వివరాలను సమర్పించాలని కోరింది.
ప్రస్తుతానికి డబ్బులు తిరిగి చెల్లింపులపైనే తమ ఆందోళన అని, కొనుగోలుదారులకు ఫ్లాట్ల అందజేత అన్నది తర్వాత దృష్టి సారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. 31,000 మంది గృహ కొనుగోలుదారుల్లో కేవలం 8 శాతం మంది రిఫండ్ ఎంచుకున్నట్టు, మిగిలిన వారు ఫ్లాట్ల కోసం ఎదురు చూస్తున్నట్టు జై ప్రకాష్ అసోసియేట్స్ కోర్టుకు తెలియజేసింది.
13,500 ఫ్లాట్లకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంత వరకు ఆక్యుపేషన్ సర్టిఫికెట్లను అందుకున్నట్టు తెలిపింది. గృహ కొనుగోలుదారుల ప్రయోజనాల రీత్యా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ సంస్థ జనవరిలో రూ.125 కోట్లను జమ చేసిన విషయం గమనార్హం.