బిట్ కాయన్ ట్రేడింగ్ చేస్తున్న వారికి ఐటీ నోటీసులు
బిట్కాయిన్ వంటి డిజిటల్ కరెన్సీలలో ట్రేడింగ్ చేస్తున్న పలువురు వ్యక్తులు, సంస్థలకు ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. పెద్దనోట్ల రద్దు సమయంలో ఎంత మొత్తంలో లావాదేవీలు నిర్వహించారు? ఈ సొమ్ము ఎక్క
బిట్కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలలో ట్రేడింగ్ చేస్తున్న పలువురు వ్యక్తులు, సంస్థలకు ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. పెద్దనోట్ల రద్దు సమయంలో ఎంత మొత్తంలో లావాదేవీలు నిర్వహించారు? ఈ సొమ్ము ఎక్కడ నుంచి వచ్చింది లాంటి మొత్తం 28 ప్రశ్నలతో దేశవ్యాప్తంగా ఉన్న అనేకమంది వర్చ్యువల్ కరెన్సీ ట్రేడర్లకు ఐటీ శాఖ నోటీసులు జారీచేసింది. గతేడాది నవంబర్ 8 నుంచి డిసెంబర్ 31 వరకు జరిగిన అన్ని క్రిప్టోకరెన్సీల లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించిన తాము ఈ విభాగంలో ట్రేడింగ్ చేసిన వారి నుంచి పలు వివరాలను కోరుతూ నోటీసులు ఇచ్చినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) వెల్లడించింది. క్రిప్టోకరెన్సీ ట్రేడర్లు, వీరి కుటుంబ సభ్యుల నుంచి 2015-16, 2016-17, 2017-18 కాలానికి సంబంధించిన పూర్తి పెట్టుబడి వివరాలను కోరినట్లు తెలిపింది. వీరు డిజిటల్ కరెన్సీ ద్వారా లాభాన్ని పొందినా.. లేదంటే, నష్టపోయినా వివరాలను తెలియజేయాలని కోరినట్లు సీబీడీటీ వివరించింది.
గతంలోనే భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ క్రిప్టో కరెన్సీలకు సంబంధించి ప్రజలను హెచ్చరిస్తూ వస్తున్నాయి. ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి వీటిని పొంజి స్కీమ్లుగా వర్ణించింది. ఒక్కోసారి మీరు పెట్టుబడి పెట్టిన డబ్బంతా కూడా పోవచ్చని చెప్పింది. వివిధ వర్చువల్ కరెన్సీలకు సంబంధించి ఒక కమిటీ లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.