జీడీపీ వృద్ది రేటు 7 శాతానికి లోపేనని అంచనా
జీఎస్టీ, నోట్ల రద్దు కారణంగా దేశ వృద్ది రేటు ప్రమాదంలో పడిందని విపక్షాలు విమర్శిస్తున్నా ఇన్ని రోజులు ప్రభుత్వం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. అయితే ఎట్టకేలకు ప్రభుత్వం వైపు నుంచే అ
జీఎస్టీ, నోట్ల రద్దు కారణంగా దేశ వృద్ది రేటు ప్రమాదంలో పడిందని విపక్షాలు విమర్శిస్తున్నా ఇన్ని రోజులు ప్రభుత్వం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. అయితే ఎట్టకేలకు ప్రభుత్వం వైపు నుంచే అసలు వాస్తవం బయటకొచ్చింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 6.5 శాతానికే పరిమితం కానుందని స్వయంగా కేంద్ర గణంకాల శాఖ (సిఎస్వో) అంచనా వేసింది. 2013-14లో 6.4 శాతంగా చోటు చేసుకున్న వృద్ధి రేటు తర్వాత ఇదే అత్యల్పం. 2016-17లో వృద్ధి రేటు 7.1 శాతంగా నమోదయ్యింది. వస్తు సేవల పన్ను అమల్లో నెలకొన్న సంక్లిష్టత వల్ల 2017-18లో భారత వృద్ధి రేటు 6.2 శాతం-6.5 శాతంగా చోటు చేసుకోనుందని ఇప్పటికే ప్రయివేటు ఆర్ధికవేత్తలు పలు సార్లు అంచనా వేశారు. ఇదే తరహాలో శుక్రవారం సిఎస్వో అంచనాలు వెల్లడి కావడం విశేషం. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ ఇతర సేవలు 9.4 శాతం వృద్ధిని కనబర్చనున్నాయని సిఎస్వో లెక్కగట్టింది.
వాణిజ్యం, హోటళ్లు, ట్రాన్స్పోర్టు, కమ్యూనికేషన్ సంబంధిత సేవలు 8.7 శాతం వృద్దిని నమోదు చేయవచ్చు. కాగా వ్యవసాయ రంగం 2.1 శాతం వృద్ధితో సరిపెట్టుకోనుందని అంచనా వేస్తున్నారు. తయారీ రంగం 4.6 శాతానికి పరిమితం కానుందని సిఎస్వో అంచనా వేసింది. 2018-19 కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. తమ హయంలో దేశ వృద్ధి పరుగులు పెడుతుందన్న భాజపా పాలకుల వరుస ప్రకటనలకు సిఎస్వో నివేదిక ప్రతికూలంగా రావడం విశేషం. కాగా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం వృద్ధి రేటు నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయే అవకాశాలు ఉన్నాయనే విధంగా వస్తున్న నివేదికలు మోడీ ప్రభుత్వానికి తలనొప్పులు తీసుకురానుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.