ఖాతాదారుల ఆధార్ వివరాలను దుర్వినియోగం చేసిన ఎయిర్టెల్
ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్కు ఆధార్ బాడీ (యూఐడీఏఐ) షాక్ ఇచ్చింది. ఎయిర్టెల్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించిన ఈ-కేవైసీ లైసెన్స్ను యూఐడీఏఐ తాత్కాలికంగా నిలిపివేసింది.
ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్కు ఆధార్ బాడీ (యూఐడీఏఐ) షాక్ ఇచ్చింది. ఎయిర్టెల్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించిన ఈ-కేవైసీ లైసెన్స్ను యూఐడీఏఐ తాత్కాలికంగా నిలిపివేసింది. ఆధార్ టు మొబైల్ సిమ్ వెరిఫికేషన్లో భాగంగా ఆధార్ను మొబైల్ నంబర్కు లింక్ చేసేటప్పుడు కస్టమర్లకు సమాచారం ఇవ్వకుండా, వారితో సంబంధం లేకుండా ఎయిర్టెల్ సంస్థ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాను తెరుస్తున్నదని గతంలో ఆరోపణలు వచ్చిన విషయం విదితమే. కాగా ఈ విషయంపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో చర్యలకు ఉపక్రమించిన యూఐడీఏఐ ఎయిర్టెల్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్కు సంబంధించిన ఈ-కేవైసీ లైసెన్స్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్లలో తెరిచిన ఖాతాలను ఎల్పీజీ సబ్సిడీ కోసం వినియోగిస్తున్నారనే సమాచారం తెలియడంతో యూఐడీఏఐ ఈ చర్యను తప్పుబట్టింది. కాగా ఈ-కేవైసీ లైసెన్స్ తాత్కాలిక నిలిపివేతపై ఎయిర్టెల్కు కూడా ఉత్తర్వులు అందినట్లు ఆ సంస్థ ప్రతినిధులు ధృవీకరించారు. అయితే ఈ విషయంపై యూఐడీఏఐ అధికారులను సంప్రదిస్తున్నామని, త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని ఎయిర్టెల్ ప్రతినిధి ఒకరు చెప్పారు. వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపారు.
యూఐడీఏఐ ఉత్తర్వులతో ఎయిర్టెల్లో కస్టమర్ల ఆధార్, మొబైల్ లింకింగ్ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దీంతోపాటు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలను సైతం తెరిచేందుకు సాధ్యం కాదు. అయితే పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలను తెరిచే విషయంలో గతంలోనే యూఐడీఏఐ ఎయిర్టెల్కు రెండు సార్లు నోటీసులను పంపింది. కానీ వారు ఇచ్చిన సమాధానంతో యూఐడీఏఐ తృప్తి చెందలేదు. దీంతో తాజాగా ఆ సంస్థ ఎయిర్టెల్పై ఈ చర్యలు తీసుకుంది.