బిట్ కాయిన్ ఎక్స్చేంజీలపై ఐటీ శాఖ దాడులు
ఈ సర్వే ద్వారా ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ అధికారులు బిట్ కాయిన్ ట్రేడింగ్ జరుపుతున్న కొంత మంది శ్రీమంతులకు చెందిన లక్షల కొద్దీ లావాదేవీలను సేకరించినట్లు తెలుస్తోంది. నల్లధనాన్ని దాచేందుకు చాలా
బిట్ కాయిన్లకు సంబంధించి గత కొన్ని రోజులుగా తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా దానికి సంబంధించిన వారు ఉలిక్కిపడేలా దేశం మొత్తం మీద ఉన్న బిట్ కాయిన్ ఎక్స్చేంజీలపై ఐటీ శాఖ దాడులు జరిపింది. పన్ను ఎగవేసి దాన్ని మరో మార్గంలో దాచే వారిని పట్టుకోవాలనే నెపంతో ఈ సర్వే ద్వారా ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ అధికారులు బిట్ కాయిన్ ట్రేడింగ్ జరుపుతున్న కొంత మంది శ్రీమంతులకు చెందిన లక్షల కొద్దీ లావాదేవీలను సేకరించినట్లు తెలుస్తోంది. నల్లధనాన్ని దాచేందుకు చాలా మంది బిట్ కాయిన్లను ఎంచుకున్నారన్న సమాచారంతో ఐటీ అధికార గణం దేశవ్యాప్తంగా ఉన్న 9 ప్రదాన బిట్ కాయిన్ ఎక్స్చేంజీలలో విచారణ నిర్వహించింది.
సోదాల ద్వారా పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా బిట్ కాయిన్ ట్రేడింగ్ ద్వారా వచ్చిన లాభాలపై పన్ను ఎగవేసిన వివరాలు బయటకొచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బెంగుళూరు విభాగం పర్యవేక్షణలో పలు దర్యాప్తు బృందాలు బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్, గురుగ్రామ్, ఘజియాబాద్, పుణె తదితర ప్రాంతాల్లోని 9 ప్రధాన ఎక్స్చేంజీల్లో తమ సోదాలను చేశాయి.
ప్రాథమిక సమాచారం మేరకు 20-25 లక్షల వరకూ హెచ్ఎన్ఐల సమాచారం లభ్యమైంది. వీటిలో 8-10 లక్షల సంస్థలు లావాదేవీల పరంగా చురుగ్గా ఉన్నట్లు తెలిసింది. అయితే, బుధవారం తనిఖీలు కొనసాగాయి. విచారణ పూర్తైతే గానీ, పూర్తి వివరాలపై స్పష్టత రాదని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. కాగా బిట్ కాయిన్లకు వ్యతిరేకంగా ప్రభుత్వం కఠిన చర్యలు మొదలుపెట్టడం ఇదే తొలిసారి.